Site icon Newsminute24

Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడు..

Telangana: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఈశాఖ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే ఏసీబీ మొత్తం 122 ట్రాప్ కేసులను నమోదు చేసింది. అంటే, నెలకు సగటున 20 కేసులకుపైగా లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఆరు నెలలు గడవకముందే ఆ సంఖ్య దాటి పోయింది. అవినీతి పెరుగుదలపై రాష్ట్రప్రజల్లో ఆందోళన పెరుగుతున్న తరుణంలో, ఏసీబీ అధికారుల దూకుడుకు అవినీతి మాఫియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఇక ఈ ఆరు నెలల్లో పట్టుబడ్డ ప్రభుత్వ అధికారుల సంఖ్య 100 మందిని దాటి పోయింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారు, చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకూ అందరూ ఏసీబీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ప్రాథమిక స్థాయి ఉద్యోగుల నుంచి వివిధ విభాగాల కీలకాధికారుల దాకా అవినీతి విస్తరణ స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం లో భాగస్వామ్యులై, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్న వారిపై ఏసీబీ నిర్వహిస్తున్న ఈ దాడులు ప్రజల్లో భరోసాను కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అనడానికి హెచ్చరికగా ఈ అరెస్టులు నిలుస్తున్నాయి.

అయితే, ఈ అరెస్టులు పూర్తిస్థాయిలో అవినీతిని నిర్మూలిస్తున్నాయా? లేక ఇది ఇంకా పెరుగుతున్న పరిస్థితికి సంకేతమా? అన్నది ప్రజల్లో నేటి ప్రధాన చర్చాంశంగా మారింది.

Exit mobile version