Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారన్నారు. దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన సీతారామరాజు..ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారని అన్నారు. సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమేనని పవన్ స్పష్టం చేశారు.
భారతరత్న ప్రకటించాలి…
నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలన్నారు పవన్. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని.. భారత రత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలన్నారు. విప్లవ వీరును జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని.. ఆ చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.