Site icon Newsminute24

రంగారెడ్డి: విద్యుత్ సమస్యకు అధికారుల తక్షణ స్పందనకు వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత

రంగారెడ్డి:  రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 269, 270, 271 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు సరైన ఎల్టీ సరఫరా లేకపోవడంతో, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నట్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు.

ఈ విషయంపై అసోసియేషన్ తరఫున ప్రతినిధులు చీఫ్ ఇంజనీర్ ఎల్. పాండ్యాని కలిసి సమస్యను వివరించారు. కాలనీలోని 6 చోట్ల ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల ఒక్కొక్కదానిపై అధిక లోడ్ పడుతున్నది. దీని కారణంగా పదేపదే లో వోల్టేజ్ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో చిన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి పెద్ద సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. చీఫ్ ఇంజనీర్ కాలనీవాసుల విన్నపాన్ని సానుభూతితో స్వీకరించి, సమస్యను డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) పవర్ కోటేశ్వరరావుకి తెలియజేశారు. అనంతరం డీఈ టెక్నికల్ విషయాన్ని పరిశీలించి, వెంటనే స్పందించి అసిస్టెంట్ ఇంజనీర్కి సూచనలు అందించారు. త్వరలోనే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించి, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.

కాలనీలో కొత్తగా ఇండ్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వీలుగా, పెద్ద ట్రాన్స్‌ఫార్మర్, ఎల్టీ లైన్, పిఎస్పిసి పోల్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు బి. శేఖర్, ఉపాధ్యక్షుడు బి.వి. సుదీర్ తదితరులు విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Exit mobile version