మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ.. “రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ జరగనుందన్నారు. ఇప్పటికే సభ నిర్వహించుకునేందుకు 34 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమినీ సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం అనందంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్లు.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు.