Newsminute24

Tamilnadu: హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము: పవన్ కళ్యాణ్

Tamilnadu: ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. దేశంలో అత్యధికులు హిందువులే అయినా వారి ధర్మం గురించి వారు మాట్లాడకూడదు. ఆచారం మంటగలిపినా నోరెత్తకూడదు. నమ్మకం మీద వెక్కిరింతలు చేసినా గొంతు ఎత్తకూడదు. భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఎదిరించకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పవన్  ప్రసంగించారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “లౌకిక వాదం ముసుగులో కొందరు… హిందువుల మత ఆచారారాలను వెక్కిరిస్తారు. ఇతర మతాల గురించి మాట్లాడేకంటే, హిందువుల ఆచారాలంటే వారికి ఎనలేని ఏహ్యత. ఈ దేశంలో ఏం జరిగినా హిందువులు నోరెత్తకూడదు అనేలా ప్రసంగాలు ఇస్తారు. దానికే సెక్యూలరిజం అని పేరు పెడతారు. ఇదేమీ తీరు. సెక్యూలరిజం అంటే ప్రత్యేకంగా హిందువులకే సంబంధించినది మాత్రమే కాదు. ఏ మతంలో తప్పు జరిగినా ప్రశించాలి. సూడో సెక్యూలరిస్టులకు మాత్రం కేవలం హిందువులు మాత్రమే కనిపించడం శోచనీయం.


• విభజన ఆలోచన నాయకులతో చాలా ప్రమాదం
ధర్మం అంటే దుష్ట శక్తులపై పోరాటం. అందరినీ సమానంగా చూడటమే ధర్మం. ఒక పార్టీ నాయకుడు మురుగ భక్తర్గళ్ మానాడు సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నారు? గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్ లో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు.? ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఎక్కడ ధర్మం దారి తప్పితే అక్కడే పోరాటం ఉంటుంది. కావాలనే ఉత్తరాదితో పోలుస్తూ సమస్యను పక్కదారి పట్టించడమే కాదు.. ప్రజల్లో విభజనవాదం తీసుకురావాలనే కుట్ర దీనిలో ఉంది. ఇలాంటి విభజన ఆలోచనలు ఉన్నవారు చాలా ప్రమాదం. ఇలాంటి వారు రేపు శివునిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారు. దేశంలో ఎక్కడ ధర్మం దారి తప్పినా అక్కడ సంఘటితంగా పోరాడటం కచ్చితంగా చేయాల్సిన పని.


• నేను నా మతాన్ని మనసారా ఆరాధిస్తాను
నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణిలో భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని. నేను నా మతాన్ని మనసారా ఆరాధిస్తాను. అలాగే ఇతర మతాలను సంపూర్ణంగా గౌరవిస్తాను. ఈ దేశంలో ఒక క్రైస్తవుడు, ముస్లిం వారి మతాలను గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని ఆచరిస్తూ, నమ్మకాలను ముందుకు తీసుకెళ్తే మాత్రం అభ్యంతరం? హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమే. మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు… శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉంది. ఇదో ఆధ్యాత్మిక మారుతాలతో విరాజిల్లే భూమి.


• దుష్ట శక్తులకు కొందరు మద్దతునిస్తున్నారు
మీనాక్షి అమ్మవారు కొలువైన పట్టణం మధురై. పార్వతీదేవి స్వరూపం అయిన మీనాక్షి అమ్మవారి ప్రసాదం మధురై. వేదాలకు నెలవైన భూమి మధురై. హిందువుల పవిత్రభూమి మధురై. అలాంటి గొప్ప భూమిలో ధర్మం కోసం నిలబడ్డట్టి, ఆ శివపార్వతుల పుత్రుడు మురుగన్ ఆశీస్సులతో ఈ గొప్ప కార్యక్రమానికి రావడం మరపురాని అనుభూతి. మీనాక్షి అమ్మవారి ఆలయానికి రోజూ వెళ్తున్నాం. అక్క‌డ అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నాం. కుంకుమ తీసుకుంటున్నాం. ప్రసాదం తింటున్నాం. కానీ… ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒకానొక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో పండితులు కనుమరుగు అయ్యారు. పూజలు జరగలేదు. ఆలయాన్ని మూసివేశారు. 14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కపూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది. అలాంటి మధురై చీకటి కాలంలో.. 14వ శతాబ్దం చివర్లో మళ్లీ విజయనగర యువరాజు కుమార కంబణన్ ఇక్కడ వెలుగులు తీసుకొచ్చారు. మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం నిగూడమైనది.


స్వయంగా ఆ శివపుత్రుడి వివాహం జరిగిన ఈ నేలను మళ్లీ అపవిత్రం చేసేందుకు ఇప్పుడు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయి. వినాశకాలే విపరీత బుద్ది అని ఇక్కడ పాలకులు కూడా ఆ శక్తులకు మద్దతు తెలుపుతున్నాయి.


• పవిత్రమైన పురాతన భూమికి రావడం గొప్ప అదృష్టం ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం మధురై. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి గొప్ప రోజు ఒకటి వస్తుంది అనుకోలేదు. నాకు ఎంతో నచ్చే గొప్ప నేల. సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు అయిన మధురై లాంటి నగరంలో ఇలాంటి గొప్ప సదావకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ ముత్తు రామలింగ దేవర్ ప్రజల కోసం పోరాడిన ప్రాంతం నుంచి ఈ కార్యక్రమం మొదలుకావడం, మనమంతా ఐక్యం కావడం మురుగన్ దయవల్లనే అని నమ్ముతాను. జనమంతా ఒక్కటే, అందరికీ ఒకే చట్టం అని నినదించిన ముత్తు రామలింగ దేవర్ స్ఫూర్తి ఆచరణీయం. మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది


మార్పు తథ్యం
ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, నాగు పాము శబ్దానికి ఎలుకలు వాటంతట అవే పరుగు తీస్తాయి. అలాగే మన శత్రువులు ఎంత మంది ఉన్నా మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారు. “అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే” అనే మహాకవి భారతీయర్ మాటలు నాకు నిత్యం ధైర్యాన్ని ఇస్తాయి. రోడ్డంతా గతుకులు, చేతిలో దీపం లేదు.. అన్న పంక్తులు కూడా ఈ మాటలకు దగ్గరగా ఉంటాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కొందరు కుత్సిత ఆలోచనలు చేసినా మురుగన్ ధర్మం ఆగదు. కార్తికేయుడిగా పిలిచినా, సుబ్రమణ్యేశ్వర స్వామిగా పిలిచినా, మురుగున్ గా కొలిచినా భక్తులకు ఆయన చూపే దారి, చెప్పే ధర్మం ఓ గొప్ప విజయానికి చూపే మార్గంగా భావిస్తాం. మార్పు అనేది తీసుకురావడం కష్టం కాదు. కానీ ఓర్పు కావాలి. దానికి మనమంతా సంసిద్ధులై ఐక్యంగా ముందుకు వెళ్లాలి. మార్పు తథ్యం. అనుకున్నది సాధిస్తాం.’’ అన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్నామలై, బీజేపీ యూత్ స్పోర్ట్స్ విభాగం నేత అమర్ ప్రసాద్ రెడ్డి, ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర సంచాలక్ వన్నిరాజన్, హిందూ మున్నాని సంస్థ అధ్యక్షులు  కదేశ్వర సుబ్రమణియం, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version