Newsminute24

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం: మాజీ ఎంపీ కేవీపీ

Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లం రుక్కంప‌ల్లి వ‌ద్ద అస్వ‌స్థ‌త‌తో విశ్రాంతి తీసుకుంటున్న జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన పాదయాత్ర తరహాలోనే తెలంగాణలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో  బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలన,  ప్రజా వ్యతిరేక పాలన గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడంతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంశాలను భట్టి విక్రమార్క ప్రజలకు పాదయాత్రలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారని కెవిపి స్పష్టం చేశారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను పాదయాత్రలో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెబుతున్నారని కెవిపి పేర్కొన్నారు.అనేక రకాల సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కారిస్తామన్న భరోసా ప్రజల్లో కల్పిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అభిమాన నాయకుడు  వైయస్ఆర్  చేపట్టిన పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న భట్టి విక్రమార్క అనేక అనుభవాలను నేర్చుకున్నారని..తాను చేపట్టిన పాదయాత్రకు అవి  ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నానని అన్నారు. స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల కింద‌ట ఇదే మే 18న డాక్ట‌ర్ వైఎస్సార్ చేప‌ట్టిన ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌లో వ‌డ‌దెబ్బ త‌గిలి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇప్పుడు కూడా భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో అదే రోజు వ‌డ‌దెబ్బ త‌గిలి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారని గుర్తు చేసుకున్నారు. సంవత్సరాల క్రితం వైయస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో అస్వస్థతకు గురైన రోజునే భట్టి విక్రమార్క స్వల్ప ఆస్వస్థత చెందడం యాదృచ్ఛికంగా జరిగిందని కేవిపీ వెల్లడించారు.

ఇక ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే ఆశీస్సులు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోడ్పాటు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహకారం, కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని కేవిపి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Exit mobile version