Newsminute24

క‌విత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు – బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం చేసేలా స్కెచ్‌..!

Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మ‌కంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

కేసీఆర్‌పై గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లు, సీనియ‌ర్ల‌పై అసంతృప్తితో ఉన్న క్యాడ‌ర్‌లో త‌న‌పై సానుభూతి పెరిగి క‌చ్చితంగా త‌న‌కు అండ‌గా నిలుస్తార‌ని క‌విత భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మ‌కంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్న‌ట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం, క‌విత వ్యూహాత్మ అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌తోపాటు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే రెండుగా చీలిన బీఆర్ఎస్ క్యాడ‌ర్‌:

పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న కార‌ణంగా క‌విత‌ను కేసీఆర్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో జిల్లాల వారీగా బీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలిస్తుంటే, మరో వర్గం హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకులకు సంఘీభావంగా నిలుస్తోంది. ఈ ప‌రిణామాలు బీఆర్ఎస్ క్యాడ‌ర్‌ను రెండుగా విచ్ఛిన్నం చేశాయి. 

త‌ద్వారా కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత గొడవలు క్యాడ‌ర్‌ను పూర్తిగా అయోమ‌యానికి గురి చేసిన‌ట్టైంది. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌, స్థానిక సంస్థల ఎన్నిక‌లకు ముందు జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలు బీఆర్ఎస్‌కు కోలుకోలేని న‌ష్టం చేస్తాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కవిత సస్పెన్షన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ నిరసనలు జరుగుతున్నాయి. కవిత మద్దతుదారులు, తెలంగాణ జాగృతి శ్రేణులు హరీష్ రావు, సంతోష్ రావు దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు, హరీష్ రావు మద్దతుదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జ‌గిత్యాల‌, నిజామాబాద్, మెద‌క్‌, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ వంటి పలు జిల్లాల్లో ఈ నిరసనలు జరిగాయి. ఈ ఘటనలు  రెండు వర్గాల మధ్య పెరుగుతున్న వైరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇప్ప‌టికే గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక‌పోవ‌డం, కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానం కోల్పోవ‌డం, ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ చేయ‌లేని దుస్థితి వంటి ప‌రిణామాలు, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌చారం, క‌విత స‌స్పెన్ష‌న్ వంటి ప‌రిణామాలు క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్‌కు క్యాడ‌ర్‌ను దూరం చేస్తున్నాయి.

ఇప్ప‌టికే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16.7 శాతానికి ప‌డిపోవ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నంగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా క‌విత స‌స్పెన్ష‌న్‌తో ఇప్ప‌టికే ఆయోమ‌యంలో ఉన్న క్యాడ‌ర్‌ బీఆర్ఎస్‌కు పూర్తిగా దూర‌మ‌వుతోంద‌ని, ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఆ పార్టీ నేత‌లు జంకుతున్న‌ట్టు తెలుస్తోంది. పోటీ చేసినా ఓట‌మి త‌ప్ప‌ద‌నే భావ‌న‌లో బీఆర్ఎస్ నేత‌లు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌విత వ‌ర్గాలు గ్రామాల్లో త‌మ‌కు ఖ‌చ్చితంగా న‌ష్టం చేస్తాయ‌నే భావ‌న‌తో పోటీకి బీఆర్ఎస్ నేత‌లు జంకుతున్న‌ట్టు తెలుస్తోంది.

Exit mobile version