Newsminute24

Hyderabad: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతులు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుపతి హతిరామ్ బావాజీ మఠానికి సంబంధించి ముఖ్యమైన అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ భేటీకి తెలంగాణలోని వివిధ బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు ప్రత్యేక పూజలు చేసే అవకాశాన్ని కల్పించాలని కవిత  విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరగనున్న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా పీఠాధిపతులు, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మఠంలో ఏర్పాట్లు చేయాలని కోరారు. అంతేకాకుండా, నైవేద్యం సమర్పించే వీలును కూడా కల్పించాలన్నారు.

ఈ వినతికి సానుకూలంగా స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులతో పాటు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. జయంతి రోజున ప్రత్యేక పూజల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు కూడా తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన బంజారా సామాజిక నేతలు టీటీడీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బంజారా సమాజానికి ఆదరాభిమానాలు చూపిన టీటీడీకి తమ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version