Janasena: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీస జీవనాధారం లేని నిరుద్యోగ యువతను, నిరుపేద కుటుంబాలను విశాఖ కిడ్నీ మాఫియా పావులుగా వాడుకుంటోందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారన్నారు. ద్విచక్ర వాహనం కొనిస్తామని ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకొచ్చారు అంటేనే పరిస్థితి అర్థం అవుతోందని మండిపడ్డారు. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన కిడ్నీ రాకెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారన్నారు. ఇంకెంతమంది బాధితులు ఉంటారో అనే ఆందోళన రోజు రోజుకూ పెరిగిపోతోందని.. సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని పెద్దా చిన్న, ఆడ మగ తేడా లేకుండా అసలేం జరుగుతోందో తెలుసుకునే లోపే బాధితుల కిడ్నీలు మాయం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ కిడ్నీ మాఫియాలో ప్రధాన సూత్రధారులు ఎవరున్నా సరే తక్షణమే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టాలని నాగబాబు డిమాండ్ చేశారు.
కాగా సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనే సంగతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు నాగబాబు. గతంలో కూడా విశాఖలో కిడ్నీ మాఫియా శరీర అవయవాలతో వ్యాపారం చేశారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మోసగాళ్ళకు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ప్రభుత్వం సరైన ఉద్యోగ అవకాశాలు అందించలేని కారణంగా అడ్డ దారులు తొక్కుతున్నారన్నారు. విశాఖ మహానగరంలో కిడ్నీ మాఫియాను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉందని నాగబాబు పేర్కొన్నారు.