janasena: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని వాపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోందన్నారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని.. వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన స్పష్టం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయన్నారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదన్నారు. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందని.. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడని అన్నారు. దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారని.. మామిడి నేల రాలిపోయిందని.. మొక్క జొన్న కూడా మొలకెత్తిపోతోందని.. రైతులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ తేల్చిచెప్పారు.
ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం ..
ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన కళ్ళారా చూశానన్నారు జనసేనాని. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారుపడ్డ బాధలు తెలుసుకున్నట్లు గుర్తుచేశారు. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నానని.. ప్రకృతి విపత్తుల మూలంగా పంటలు కోల్పోతున్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకోస్తామని.. రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నట్లు జనసేనాని పేర్కొన్నారు.