Telanganaelections: ‘ తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తాను ఏ నాడూ అర్రులు చాచలేదన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినని..అక్కడే ఉండిపోయేవాడినని స్పష్టం చేశారు. తన ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల యువత బంగారు భవిష్యత్తు.. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర కలలు, ఆకాంక్షల సాకారం మాత్రమేనని తేల్చిచెప్పారు. తెలంగాణ సంపూర్ణ ఎదుగుదలకు జనసేన సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు పవన్. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికారం దగ్గర కావాలన్నారు. తెలంగాణ సాధించుకున్నప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని అంతా అనుకున్నామని… అంతా సంతోషించామని.. ఆ కల నెరవేరలేదాని.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కచ్చితంగా బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని మాటకు తెలంగాణ ప్రజానీకం అంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని.. కచ్చితంగా అది అందరికీ అందాలని.. అప్పుడే సమాజంలో సంపూర్ణ మార్పు సాధ్యమని పవన్ చెప్పుకొచ్చారు.