Bandisanjay:భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఈరోజు కరీంగనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.. ఇయాళ కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నడు… మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి?’’అని అన్నారు.
అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నామని, తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలకు పద్మసహా ఉన్నత అవార్డులను ప్రదానం చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పద్మ అవార్డులు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. గతంలో పైరవీలు చేసుకునే వారికే అవార్డులు వచ్చేవని, మోదీ హయాంలో పైరవీలు, అవినీతికి తావులేకుండా నిష్షాతులైన వారికే అవార్డులు వరిస్తున్నాయని, ఎంతోమంది పేదలకు అవార్డులు దక్కడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.