Newsminute24

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024:

ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో, అది కాంగ్రెస్కు అనుకూలంగా మారనుందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను కుల సమీకరణాలతో ఎదుర్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అవే కుల సమీకరణాల సూత్రంతో పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి చేస్తుండడంతో హర్యానా ఎన్నికలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి.

రాష్ట్రం ఆవిర్భావం నాటి నుండి కుల సమీకరణాలు హర్యానాలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో జాట్ ఓట్లతో పాటు ఎస్సీ సామాజిక ఓట్లను కూడా పొంది గెలవాలని కాంగ్రెస్ చూస్తుంటే, ఈ సమీకరణాలకు పోటీగా ఓబీసీలతో పాటు అగ్రవర్ణాల సామాజిక ఓట్లను పొంది గట్టెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. రైతుల వ్యతిరేకత, అగ్నివీర్ పథకంపై యువత ఆగ్రహం, రెజ్లింగ్ క్రీడాకారుల నిరసనలు, ధరల పెరుగుదలతో మహిళల్లో అసంతృప్తి అంశాలతో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. లాడో లక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2100, బాలికలకు స్కూటీ, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు నిరుద్యోగ భృతి, ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు వంటి ప్రజాకర్షణ పథకాలతో ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చేయాలని బీజేపీ భావిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలంగా లేవు. దీనికి తోడు జాట్లు, ఎస్సీ ఓటర్లు కాంగ్రెస్కు వెనుదన్నుగా ఉండడంతో బీజేపీ జాట్లేతర ఓట్లను సమిష్టిగా పొందేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఎన్నికలు జాట్లు, జాట్లేతర మధ్య ఉండేలా చూసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నాలు సఫలం కావడం సులభం కాదని లోక్సభ ఫలితాలతో స్పష్టమైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీకి చెందిన నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసినా సత్ఫలితాలు రాలేదు. జాట్లతో పాటు ఎస్సీలు కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడంతో రాష్ట్రంలో పది ఎంపీ స్థానాలుండగా రెండు పార్టీలు చెరో ఐదు స్థానాలు సాధించాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్లీ ఇవే ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

హర్యానాలో 27 శాతం ఉన్న జాట్లు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రముఖ జాట్ నేతలు బన్సీలాల్, దేవీలాల్, ఓం ప్రకాశ్ చౌతాల, భూపీందర్ సింగ్ హూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులను చేపట్టారు. జాట్లు 2014 లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ వెంటే ఉన్నా, తర్వాత దేశ రాజకీయాల్లో ఏర్పడిన పరిణామాలతో రాష్ట్రంలో కూడా మార్పులు సంభవించాయి. ప్రాంతీయ పార్టీలైన జేపీపీ, లోక్దళ్, ఐఎన్ఎల్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాట్ నేతల ఆధిపత్యత కనిపిస్తుంది. కాంగ్రెస్ దీనికి అదనంగా రాష్ట్రంలో 21 శాతం ఉన్న ఎస్సీ ఓట్లపై కూడా కన్నేసింది. ప్రధానంగా ఎస్సీల్లో అధికంగా ఉండే చమర్ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

జాతీయ రాజకీయాల్లో మోదీ ప్రవేశంతో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో హర్యానా రాజకీయాలో పెను మార్పులు సంభవించాయి. 2009లో ఒక్క సీటు గెలవని బీజేపీ 2014లో ఏడు స్థానాలు పొందింది. బ్రాహ్మణ్లు, బనియన్లు, పంజాబీ ఖత్రీలు, అరోరాలు వంటి అగ్ర వర్ణాలతో పాటు ఓబీసీలోని ఆహిర్, యాదవ్, గుర్జర్, సైనీ వంటి సామాజిక వర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ పరిణామాలతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీ ఎవరూ ఊహించని విధంగా 2014లో 47 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో జాట్లు, జాట్లేతర రాజకీయాలకు నాంది పలికినట్టయ్యింది. పంజాబీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ముఖమంత్రిగా, అహిర్, యాదవ్ వర్గాలకు చెందిన పలువురు నేతలు కీలక పదవులు చేపట్టారు.

జాట్లేతర ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి 2016లో జాట్ల రిజర్వేషన్ల ఉద్యమం ఇబ్బందికర పరిస్థితులు తెచ్చాయి. దీంతో 2019లో బీజేపీ 40 స్థానాలకే పరిమితం కావడంతో హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం జాట్ల ఓట్లకు వ్యతిరేకంగా ఓబీసీ ఓట్లను ఏకపక్షంగా పొందాలని చూస్తున్న బీజేపీ 5 శాతం ఉన్న సైనీ సామాజిక వర్గానికి చెందిన నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధమైంది. మరోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మోహన్లాల్ బదోలికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. టికెట్ల కేటాయింపులో జాట్లకు బీజేపీ 15 టికెట్లు (17%) కేటాయించగా, కాంగ్రెస్ 28 స్థానాలు (31%) ఇచ్చింది. వ్యవసాయ రంగంలో జాట్లు అధికంగా ఉండడంతో, రైతు వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ ఈ సామాజిక వర్గానికి తక్కువ టికెట్లు ఇచ్చింది. జాట్ల సామాజిక వర్గం ప్రభావమున్న ప్రాంతీయ పార్టీలు జేజేపీ, ఐఎన్ఎల్డీ రాష్ట్రంలో క్రమంగా బలహీనపడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ జాట్ల ఓట్లపై మరింత ఆశలు పెంచుకుంది. బీజేపీపై జాట్లు అధికంగా ఉండే రైతుల ఆగ్రహం కాంగ్రెస్కు కలిసి వస్తుంది. 65 శాతం మంది రైతులు కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నట్టు పీపుల్స్ పల్స్ ట్రాక్ పోల్ సర్వేలో వెల్లడైంది.
జాట్లేతర ఓట్లపై దృష్టి పెట్టిన బీజేపీ టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకు ఓబీసీలకు ప్రాధాన్యతిచ్చింది. ఇందుకు ఉదాహరణగా గోహన సెగ్మంట్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ 30 శాతం జాట్లు ఉండడంతో గతంలో అన్ని పార్టీలు జాట్లకే టికెట్ ఇచ్చేవి. ఇప్పుడు బీజేపీ జాట్లకు బదులుగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ శర్మకు టికెట్ ఇచ్చింది. జాట్లేతర ఓట్లపై దృష్టి పెట్టిన బీజేపీ బ్రాహ్మణులకు, పంజీబీ ఖాత్రీలకు చెరో 11 స్థానాలు ఇచ్చింది. ఖాత్రిలకు 2019లో తొమ్మిది టికెట్లిచ్చిన బీజేపీ మనోహర లాల్ ఖట్టర్ ప్రభావంతో ఈసారి 11 స్థానాలిచ్చింది.

మరోవైపు కాంగ్రెస్ బ్రాహ్మణులకు 5, పంజాబీ ఖాత్రిలకు 6 టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో 40 శాతం ఉన్న ఓబీసీల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీఎం సైనీని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని లాద్వా అసెంబ్లీ సెగ్మంట్ నుండి బరిలోకి దింపింది. దీంతో ఓబీసీలు అధికంగా ఉండే కురుక్షేత్ర, అంబాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో మేలు జరుగుతుందని పార్టీ భావిస్తోంది. బీజేపీ యాదవ సామాజిక వర్గానికి ఏడు, గుర్జర్ సామాజిక వర్గానికి ఆరు స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ యాదవ సామాజిక వర్గానికి ఆరు, గుర్జర్ సామాజిక వర్గానికి ఏడు స్థానాలు ఇచ్చింది. రెండు పార్టీలు తమకు మద్దతుగా నిలుస్తాయనుకుంటున్న ఆయా సామాజిక వర్గాల ఓట్లను ఏకీకృత చేయడంపైనే దృష్టి సారించాయి.
రాష్ట్రంలో ఓబీసీ, అగ్రవర్ణాల సోషల్ ఇంజినీరింగ్తో పాటు సంక్షేమ పథకాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీని గట్టెక్కిస్తాయా అని అధ్యయనం చేయడానికి పీపుల్స్ పల్స్ సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంత సులభం కాదని తెలుస్తుంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 23, ఐఎన్ఎల్డీ – బీఎస్పీ – హెచ్ఎల్పీ కూటమి 3, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలిన 26 స్థానాల్లో పోటాపోటీ నెలకొంది. గట్టిపోటీ ఉన్న ఈ 26 స్థానాల్లో చాలాచోట్ల కాంగ్రెస్కే కొంత మెరుగైన పరిస్థితి ఉంది. కాంగ్రెస్కు 45 శాతం, బీజేపీకి 40 శాతం, ఐఎన్ఎల్డీ – బీఎస్పీ -హెచ్ఎల్పీ కూటమికి 5 శాతం, జేజేపీకి 1 శాతం, ఆప్కు 0.5 శాతం, ఇతరులకు 8.5 శాతం ఓట్లు లభించే అవకాశమున్నట్టు ట్రాక్ సర్వేలో తేలింది.

ముఖ్యమంత్రి ఎవరు..?

హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని ట్రాక్పోల్ సర్వేలో ఓటర్లను ప్రశ్నించగా 39 శాతం మంది మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా వైపు మొగ్గు చూపగా, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం మద్దతే లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో హర్యానా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కాంగ్రెస్కు కొంత అనుకూలంగానే కనిపిస్తోంది.
కుస్తీ పోటీలకు పేరుగాంచిన హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీని జాట్లేతర కుల సమీకరణాలు గట్టెక్కిస్తాయా..? జాట్లు, ఎస్సీ కులసమీకరణ కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేరుస్తుందా..? రెండు పార్టీల సోషల్ ఇంజినీరింగ్ ఎవరికి మేలు చేకూరుస్తాయో అనేది అక్టోబర్ 5వ తేదీన ప్రజలిచ్చే తీర్పు అక్టోబర్ 8వ తేదీన వెలువడే ఫలితాల్లో తేలనుంది.

-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Exit mobile version