Newsminute24

Telangana: కేసీఆర్ బాటలో కవిత..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టిన ఆమె జూలై 17న రైల్ రోకో నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని కవిత రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నేతలను, బీసీ సంఘాలను, పౌర సమాజ నేతలను కలుపుకుంటూ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం( ఈ రోజు)బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు విషయాలపై సుధీర్ఘంగా చర్చించిన అనంతరం మద్దతు కోసం కృష్ణయ్యకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు  తదుపరి దశలో సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆర్ఎల్డీ నేతలతో కూడా భేటీ కావాలని కవిత భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కూడా కలిసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీసీ సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున చేపట్టడానికి కవిత సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీ కి ఓ ప్రతినిధి బృందంతో వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసే యోచనలో ఉన్నారు.

కోస మెరుపు ఏంటంటే అన్ని పార్టీల నేతలను కలుస్తున్న కవిత, తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌ను కూడా కలుస్తారా? లేదా అన్నది? రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version