Janasena: ‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి.. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలా చేసింది ఎవరు..? ఫోర్జరీ చేసిన ఫైల్స్ ఏమిటి? రెవెన్యూ శాఖకు సంబంధించినవా.. గనులు శాఖవా? బదిలీలు, నియామకాలకు చెందినవా? ఇంకా ఇతర ముఖ్య ఫైల్స్ దీనిలో ఉన్నాయా..? అనేది అంతు పట్టకుండా ఉందన్నారు. సీఎం పేషీలో ఇంత పెద్ద తప్పు జరిగినా విషయం బయటకు పొక్కకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచుతున్నారు..? దీని వెనుక ఉన్న శక్తులు.. వ్యక్తులను ఎవరు?? వారిని వెనకేసుకొస్తుంది ఎవరు?? ఏ ఫైల్స్ విషయంలో తప్పు జరిగిందో వెంటనే సీఎంఓ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
నియంత మాదిరి వ్యవహరించే ముఖ్యమంత్రి తన కార్యాలయంలో జరిగిన విషయాన్ని దాచిపెట్టడం చూస్తే, ఏదో పెద్ద తప్పే జరిగింది అని అర్థమవుతుందని మనోహర్ సందేహం వ్యక్తం చేశారు. అన్ని దాపరికం, అంతా దాపరికం అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలనలో బటన్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో?ఎలా అప్పులు చేస్తున్నారో? పత్రికల్లో వార్తలు వస్తే అప్పటికప్పుడు ముగ్గురు నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారని..మరి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకం పక్కదారి పట్టి , భారీగా ఫైల్స్ బైటికి వెళ్లి పోయినా ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం చూస్తే దాని వెనుక కీలకమైన ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అన్న అనుమానం వస్తోందని.. ఇప్పుడు ఎవర్ని బాధ్యులని చేస్తారని? నాదెండ్ల నిలదీశారు.