ఆరునూరైనా సూర్యాపేటలో కాషాయ జెండా ఎగరేస్తాం: సంకినేని వెంకటేశ్వరరావు
తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి పరిపాలనను అంతం చేయడానికి బీజేపీ సిద్ధమైందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. శనివారం జరగనున్న పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనం సభా స్థలిని ఆయన కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా పోలింగ్ బూత్ కార్యకర్తల తో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రం తో పాటు, సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిని కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికార పార్టీకి బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు.
మరోవైపు దురాజుపల్లి లింగమంతుల స్వామి జాతర.. టిఆర్ఎస్ నాయకులకు ప్రసాదం మాదిరిగా సంకినేని ఆరోపించారు. ప్రజల్లో మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులను మునుగోడు ఉప ఎన్నికల్లో పంచినట్టుగా.. సూర్యాపేటలో పంచి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆరునూరైనా సూర్యాపేటలో గులాబీ జెండాను దించి కాషాయపు జెండాను ఎగరవేస్తామని సంకినేని తేల్చిచెప్పారు.