బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మధ్య నడిచిన వాట్సాప్ చాట్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనన్యను ప్రశ్నించారు. ఈ విచారణలో డ్రగ్స్ గురించి ఆర్యన్తో జోక్ చేసినట్లు అనన్య తెలియజేశారని సమాచారం.
అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్లను ఎన్సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించారని ఎన్సీబి తెలియజేసింది. వీరిద్దరి సంభాషణలో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అనన్యను అడిగినట్లు… దీనికి, అనన్య పాండే, నేను ఏర్పాటు చేస్తాను అని బదులిచ్చిందని ఎన్సీబీ తెలియజేసింది.
అయితే, అనన్య పాండేకి ఎన్సీబి ఈ చాట్ను చూపించినప్పుడు, నేను జోక్ చేశాను… అని ఆమె సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అయితే, ఆర్యన్ ఖాన్ కోసం ఆమె డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంతే కాక, రికవరీ చేసిన చాటింగ్లో డ్రగ్స్ నిషేధంపైన వీరిద్దరి మధ్య సుదీర్ఘ సంభాషణ నడిచినట్లు తెలుస్తుంది.
ఇక గురువారం కొనసాగిని విచారణలో భాగంగా అనన్య తనకీ, ఆర్యన్ కుటుంబానికి మధ్య సంబంధం గురించి వివరించారని ఎన్సీబీ వర్గాలు తెలియజేశాయి. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్యన్ ఖాన్తో కలిసి తాను చదువుకున్నానని, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా కూడా అనన్యకు అత్యంత సన్నిహితురాలనీ, వారంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనన్య పాండే ఎన్సీబీకి చెప్పింది.
కాగా తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని అనన్య ఎన్సీబీ అధికారులకు చెప్పింది. ఆర్యన్ ఖాన్తో చాట్ల గురించి అడిగినప్పుడు, సంభాషణలు పాతవి కావడంతో ఆమె గుర్తుకు రాలేదని చెప్పింది. డ్రగ్స్పై జరిగిన చాట్ గురించి ఎన్సీబీ అధికారులు అడిగినప్పుడు, అనన్య పాండే అది సిగరెట్ల గురించి కానీ గంజాయి గురించి కాదు అని చెప్పినట్లు సమాచారం. అయితే, గంజాయి ఒక మాదక ద్రవ్యమని తనకు తెలియదని అనన్య చెప్పడం విశేషం.