Loksabhaelections2024: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు లోక్సభ ఎన్నికలవైపు మళ్లాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలుండగా.. బీఆర్ఎస్ కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కాబట్టి మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. మొత్తంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటి నామమాత్రంగా.. కాంగ్రెస్_ బీజేపీతో మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో తన పట్టును నిలబెట్టుకునేలా సర్వశక్తులను ప్రయోగించడం ఖాయం. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీల హామీతో విజయవంతం అయ్యింది. కర్ణాటకలో గ్యారెంటీల అమలులో కొంత లోటుపాట్లు ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లోగా అక్కడ బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయనే వార్తలున్నాయి. కర్ణాటక పరిణామాలను గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఆరు గ్యారెంటీల అమలే కీలకం కానున్నాయి. అందుకే రేవంత్ ప్రమాణస్వీకారం రోజునే తొలి సంతకం ఈ గ్యారెంటీలపైనే చేశారు. ఈ పథకాలను లోటుపాట్లు లేకుండా విజయవంతంగా అమలు చేస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రయోజనం చేకూరుస్తాయి. బీజేపీ భావోద్వేగాల ఎజెండాను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన హామీని ముందుకు తెచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలో కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ ప్రకటనలు బీజేపీకి ఆశించిన ఫలితాల్వివ్వలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణను వేగవంతం చేస్తే లోక్సభ ఎన్నికల్లో మేలు కలగవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన బీజేపీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరులా ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర చీఫ్ను మారుస్తారనే వార్తలొస్తున్నాయి. లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్లో పార్టీకి నష్టం జరిగిందనే భావనతో ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణ, గ్రేటర్లో బీజేపీకి బలమైన కేడర్ ఉన్నా, పలు సవాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ తరుఫున ఉన్న నలుగురు ఎంపీలూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ బీజేపీ పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ రెండు చోట్ల రెండో స్థానంలో నిలవగా మరో ఐదు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాలు ఆ పార్టీకి ప్రమాద ఘంటికలే.
గత లోక్సభ ఎన్నికల్లో కారు-సారు-పదహారు నినాదంతో పోటీ చేసిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు కొంత భిన్నంగా కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కేడర్ షాకులో ఉన్నారు. మరోవైపు రేవంత్రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుండే గత పాలకుల విధానాలను సమీక్షించడం ద్వారా బీఆర్ఎస్పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల, విద్యుత్ రంగం అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో బీఆర్ఎస్లో ఆందోళన నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్కు పెద్ద సవాలు తమ ఎమ్మెల్యేలను, కేడర్ను కాపాడుకోవడమే. ఓటమితో నిరాశనిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్లో ఒకవైపు ఉత్సాహాన్ని నింపుతూనే, మరోవైపు ముఖ్యనేతలు పార్టీని వీడకుండా కాపాడుకోవడం కీలకం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆశించి ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్కు ఇప్పుడు ఇంట గెలవడమే పెద్ద సవాలుగా మారనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక అసెంబ్లీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి. గ్రేటర్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధించినా లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ ప్రధాన పోటీ పార్టీగా ఉండవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్, వరంగల్లో కూడా లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాల ఆధారంగా ఓటు వేస్తామని, లోక్సభ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని కొందరు చెప్పడం గమనార్హం.
ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికలొచ్చేసరికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్యనే రాష్ట్రంలో ప్రధాన పోటీ జరగవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ ఆటలో అరటిపండుగా మారే అవకాశాలున్నాయి.
==================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ,