BJPTelangana: ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జన సభ దిగ్విజయం కావడంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రూ. 13,500 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా నష్టపోతామనే దురుద్దేశంతో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తమది కుటుంబ పార్టీయేనని చెప్పుకుంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని నిరుద్యోగులు, పేద ప్రజలు, మహిళలు తమ కుటుంబ సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు , రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ , తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..పాలమూరు ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలివచ్చి దిగ్విజయం చేశారని పేర్కొన్నారు.ప్రపంచం జీ 20 సమావేశాలు, చంద్రయాన్-3 విజయం, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపేలా మహిళలు, యువకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారని అన్నారు.నరేంద్ర మోదీ సభ విజయవంతం కావడంతో కేటీఆర్ మొదలు హరీశ్ రావు, కవిత వరకు… కల్వకుంట్ల కుటుంబం మొత్తం బిత్తరపోతున్నారని ఎద్దేవ చేశారు.తమ కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని.. ప్రధానిపై కనీసం గౌరవం లేకుండా సోయితప్పి మతిభ్రమించినట్లు కేటీఆర్ ప్రేలాపనలు చేస్తున్నాడని మండి పడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయి తెలంగాణ సంపదను దోచుకుంటూ, నియంతృత్వ పోకడతో ప్రజలను పీడిస్తూ ప్రజాస్వామిక హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారని ఆరోపించారు.కల్వకుంట్ల కుటుంబం పాలనను అంతమొందించాలని పిలుపునిస్తే.. నిస్సిగ్గుగా బరాబర్ తమది కుటుంబ పార్టీయేనంటూ జబ్బలు చరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దగా చేసిన్రు. మరి దళితులు మీ కుటుంబ సభ్యులు కాదా?అని లక్ష్మణ్ ప్రశ్నించారు.