ప్రాణకోటికి ఆధారం పంచభూతాలు. వీటికి మూలం పంచ స్థూల దేవాలయాలు. అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్న ఈ దేవాలయాల్లో పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.శివరాత్రి పర్వదినాన లింగరూపంలో ఉన్న భోళాశంకరుడిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు. పంచ స్థూల దేవాలయాల్లో కొలువైఉన్నా పరమ పవిత్రమైన లింగాలను పంచభూత లింగాలుగా పిలుస్తారు. ఇంతటి విశిష్టత కల్గిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం!
1. పృథ్విలింగం :
ఇక్కడ కొలువైఉన్నా పరమేశ్వరుడిని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. మామిడి చెట్టు కింద స్వామి వెలిశాడు కాబట్టి స్వామికి ఆ పేరు వచ్చిందని భక్తులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఒకటిగా ప్రసిద్ది. భారతదేశంలో ఉన్నా అతిపెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. దేవాలయమలో వెయ్యి స్థంబాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్టబడి ఉండడం విశేషంగా చెప్పొచ్చు.
2 .ఆకాశలింగం :
ఈ ఆలయం తమిళనాడు చిదంబర క్షేత్రంలో ఉంది. ఇక్కడి లింగం ప్రత్యేకత శూన్యంగా కనిపించడం. అందువల్లే ఈ ఆలయానికి చిదంబర రహస్యం పేరు వచ్చింది.ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవ రంద్రాలకు సూచికలుగా పరిగణిస్తారు. ఈ క్షేత్రంలో నటరాజ స్వామి,శివకామ సుందరి అమ్మవార్లు దర్శనమిస్తారు. ఆలయానికి చేరుకోవాలంటే చెన్నై నుంచి 231 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
3.జలలింగం :
ఈ ఆలయం తమిళనాడులోని తిరుచురాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ .దూరంలో కలదు. ఆలయ లింగం క్రింది భాగంలో నీటి ఊట ఉండడం వలన జలలింగంగా స్వామిని కొలుస్తారు. ఇక్కడి స్వామిని జంబుకేశ్వరుడిగా పిలుస్తారు. దీంతో ఈ క్షేత్రం జంబుకేశ్వర ఆలయంగా ప్రసిద్ది. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.ఇక్కడి అమ్మవారు అఖిలాండేశ్వరి.
4.తేజోలింగం :
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉంది. ఇక్కడి లింగాన్ని అగ్ని లింగంగా పిలుస్తారు. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. ఇక్అకడి మ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
5.వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇక్కడి ఆలయం ప్రత్యేకత స్వయంభువుగా వెలసిన శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడడం.అందువలన ఆలయం వాయులింగంగా ప్రసిద్ది.