ఏపీలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. అన్నవరం సత్యనారయణ స్వామి దేవస్థానంలో పూజ కార్యక్రమాల అనంతరం కత్తిపూడిలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక సాక్షిగా జనసేనాని ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. అటు బహిరంగ సభకు ఏపీ వ్యాప్తంగా జనసైనికులు భారీ సంఖ్యలో తరలిరానున్నట్లు జనసేన నాయకులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పవన్ సభపై రాజకీయ నిపుణులతో పాటు యావత్ ఏపీ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇక అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలివిడత వారాహి యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు, పీఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజోలు, పి.గన్నవరం,నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కత్తిపుడి తోపాటు ఈనెల 21న జరగనున్న అమలాపురం భారీ బహిరంగ సభకు సైతం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వారాహి యాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసిన జనసేన ప్లెక్సీలు, పోస్టర్లు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంచితే వారాహి యాత్రపై జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. వైఎస్సార్సీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి దూసుకొస్తున్న వారాహి క్యాప్షన్ తో రూపొందించిన పోస్టర్ పై జనసైనికులతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. రాక్షస పాలన అంతం చేయడానికి వస్తున్న జనసైనికుడి ప్రచార రథం వారాహి చూస్తుంటే వైసీపీ నేతలకు గుండెల్లో దడ పుడుతుందని ఎద్దేవ చేస్తూ కామెంట్లు జోడిస్తున్నారు.