హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా కొత్తగా, నవీనంగా ఉంటేనే సంస్థలు బ్రతుకుతాయని వివరించారు. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం మాత్రమే కాదని, ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇళ్లాలని తెలిపారు. “లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు. తల్లి గర్భంలో నుంచి ఎవరూ కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్పా మూస పద్దతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు.” అని వ్యాఖ్యానించారు.
కాగా తోటి వారి గోప్యతను, మర్యాదను కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడడం ట్రెండ్ గా మారిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు యూట్యూబర్ల అండ కూడా బాగా ఉందని, ఎవరెక్కువ తిడితే వారికి అన్ని వ్యూవ్స్ ఎక్కువ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి నాయకులు తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండని సూచించారు. తిట్లకు దిగజారామంటే విషయం లేదని అర్థమని, పక్కోడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యే, ఎంపీగా లేరు.. కానీ ఇవాళటికీ అందరం గాంధీని గుర్తు చేసుకుంటామని చెప్పారు. “తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. శతృవు ఒక చెంపపై కొడితే మరో చెంపు చూపించమని గాంధీ అంటారు. కానీ మనం శతృవు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. మన ఆలోచనే ఆయుధం కావాలి.” అని వ్యాఖ్యానించారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉందని ఒక సర్వేలో తేలిందని ప్రస్తావించారు.
సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదని, సాంస్కృతిక నేపథ్యం లేని జాతి పునాది లేకుండా కట్టిన బిల్డింగ్ లాంటిదని ఎమ్మెల్సీ వివరించారు. తెలంగాణ జాతికి అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. దాన్ని పరిరక్షించడమే మన ఆలోచనగా తెలంగాణ జాగృతి పని చేస్తూ వచ్చిందని స్పష్టం చేశారు. గత 19 ఏళ్లలో మన భాష, యాస, కట్టు, బొట్టు, బతుకమ్మ, బోనం వంటి వాటి గురించి కొట్లాడిందని, తెలంగాణ ఉద్యమకాలంలో యాసను అవహేళన చేసిన ఒక వ్యక్తికి నంది అవార్డును ఇవ్వాన్ని నిరసించిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి అని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అని వివరించారు. నమ్మిన సిద్దాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరై, ఎంత పెద్ద మాద్యమమైనా ఎదురొడ్డి నిలిచిన సంస్థ తెలంగాణ జాగృతి అని తేల్చిచెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం కొట్లాడాము… వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం పనిచేశామని, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.