వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కామం మత్తులో కన్నుమిన్నుకానక చేసే తప్పిదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎందరో చిన్నారులు అనాధాలుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు దూరం కావడంతో తెలిసి తెలియని వయసులో ఆ చిన్నారులు పడుతున్నబాధలు వర్ణనాతీతం. ఆకోవకు చెందిందే ఈబాలుడి కథ. తల్లి చేసిన ఘోర తప్పిదం..ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది.
(అనుకోని రైలు ప్రయాణంలో ఓ యువ కానిస్టేబుల్ కంటపడిన కథలోని బాలుడు.. ఈ కథను తానే స్వయంగా రాశానని.. చిన్న తనంలో తన జీవితంలో జరిగిన చీకటి అధ్యాయమని చెప్పడంతో ఆశ్చర్య పోవడం కానిస్టేబుల్ వంతైంది)
బాలుడు రాసిన యథార్థ కథ (ఉన్నది ఉన్నట్టు) పార్ట్ -1:
అనగనగా ఒక ఊరు. ఆఊరిలో ఓపిల్లవాడు ఉన్నాడు. ఆపిల్లవాడి ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య ఉండేవారు. వాడికి వాళ్ల అమ్మ అంటే కొంచెం ఇష్టం.. నాన్న అంటే ప్రాణం. వాళ్ల నాన్నను విడిచి ఎక్కడికి వెళ్లేవాడు కాదు. హాయిగా సాగుతున్న ఆకుటుంబంలో వివాహేతర సంబంధం నిప్పులు పోసింది. బాలుడి తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ కంటపడటంతో.. తండ్రి పట్టలేని కోపంతో ఇద్దరి తలలపై గొడ్డలితో దాడిచేశాడు. ఈదాడిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం బాలుడి తండ్రిపై తల్లి పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు అతనిని తీసుకెళ్లడానికి వచ్చారు. పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు.. వాళ్లకు అన్నం తినిపించి వస్తాను అని పోలీసులకు మొరపెట్టుకున్న వినకుండా అతనిని పట్టుకెళ్లారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు రిలీజ్ చేయండతో వచ్చే దారిలో కొంచెం అన్నాన్ని తీసుకొచ్చాడు ఆపిల్లాడి తండ్రి. దీంతో పిల్లలు ఏడుస్తూనే తండ్రి తెచ్చిన అన్నాన్ని తినేశారు.
పార్ట్- 2:
మరోసారి పోలీసులు పిల్లాడి తండ్రిని విచారణకు తీసుకెళ్దామని ఇంటికొచ్చారు. ఆసమయంలో పిల్లలు బడికి వెళ్లారు. తీరా ఇంటికొచ్చి చూస్తే తండ్రి లేరు. దీంతో తండ్రి కోసం పిల్లలు ఊరంతా వెతికారు. ఇంతలో ఓ ఆంటి.. మీనాన్నను పోలీసులు పట్టుకెళ్లారు అని చెప్పింది.కానీ ఇంటికెళ్లి చూస్తే తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు కొట్టిన దెబ్బలతో తండ్రి విలవిలలాడడం చూసి పిల్లలు బోరున ఏడ్చారు. కేసు ఇంతటితో ముగిసిపోయింది. ఇంతలో బాలుడి అత్తయ్య వచ్చి.. మీరంతా వచ్చి మా ఇంటి దగ్గర ఉండండి అని బతిమాలింది. కానీ వాళ్లు వెళ్లలేదు. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లాడి తండ్రికి క్యాన్సర్ వచ్చింది. ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ కు వెళ్లి కిమో థెరపి చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఎలాగో అలాగా ఆపరేషన్ సజావుగా సాగడంతో పిల్లలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం వాళ్ల జీవితం సాఫిగా సాగుతోంది. ఇంతటితో కథ సమాప్తం..
( ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న కథలోని బాలుడు భవిష్యత్లో మంచి దర్శకుడు కావాలన్నది తన కోరికగా కానిస్టేబుల్ తో చెప్పుకొచ్చాడు)
నోట్: తాత్కాలిక సుఖాల కోసం నూరేళ్ళ జీవితాన్ని ఆగం చేసుకోకండి.