Jharkhandelections: “ఇండియా” ఆశలన్నీ సోరేన్ పైనే..!

HemantSoren:

 దట్టమైన అడవులతో ‘వనాంచల్’గా పిలువబడే ఖనిజాలకు నిలయమైన గిరిజనుల గడ్డ జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రసతవత్తరంగా మారుతోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఐదు రాష్ట్రాల సరిహద్దులతో భిన్న సంస్కృతికి నెలవైన జార్ఘండ్లో జనాభారీత్య అధిపత్యంలో ఉన్న గిరిజనులు అధికారాన్ని శాసించనున్నారు. పరిశ్రమలు కొలువైన రాజధాని రాంచీ కేంద్రకంగా రాజకీయ పట్టు కోసం ‘ఎన్డీఏ’, ‘ఇండియా’ కూటములు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నవంబర్ 13, 20 తేదీలలో రెండు విడతలలో జరగనున్న శాసనసభ ఎన్నికలు ప్రధానంగా గిరిజనుల చుట్టే తిరుగున్నాయి.

ఉమ్మడి బీహార్కు వేసవి విడిది అయిన రాంచీ రాజధానిగా 2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. 24 ఏళ్లలో ఏడుగురు ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపట్టగా, 13 సార్లు ప్రమాణస్వీకారాలు జరిగాయి. బీజేపీ అధికంగా 13 ఏళ్లు అధికారంలో ఉంది. బీజేపీ నేత రఘబర్ దాస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఐదేళ్లు (2014-19) సీఎంగా ఉండగా, మిగతా ఆరుగురు సీఎంలు పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. రాజకీయ అనిశ్చితితో అభివృద్ధిలో వెనుకబడిన జార్ఖండ్లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవడంతో 2014లో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టగా, ప్రభుత్వ వ్యతిరేకతతో 2019లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2019లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమిని ప్రజలు స్పష్టమైన మెజార్టీతో గెలిపిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఐదేళ్లూ జేఎంఎం ప్రభుత్వం కొనసాగినా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై కేసులతో ఆయన పాలనకు మధ్యలో ఆరు నెలల విరామం ఏర్పడింది.


నాలుగు సంవత్సరాలుగా సీఎంగా ఉన్న జేఎంఎం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై మనీలాండరింగ్ కేసులు నమోదుకావడం అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారింది. కేసుతో పదవి కోల్పోయిన ఆయన బెయిల్ రావడంతో గత జులైలో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. హేమంత్ సోరెన్ జైలులో ఉన్న 150 రోజుల అనిశ్చితితో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. హేమంత్ సోరెన్ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చంపాయి సోరెన్ సీఎం బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్ తిరిగి సీఎం కాగానే చంపాయి సోరెన్ బీజేపీలో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు రాష్ట్రంలో పట్టున్నా ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలది కీలకపాత్ర. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమిలో, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీ(యూ), లోక్జన్శక్తి పార్టీలతో ‘ఎన్డీఏ’ కూటమిలో సీట్ల కేటాయింపులో తొలుత లుకలుకలు కనిపించినా సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ‘ఎన్డీఏ’లో బీజేపీ 68, ఏజేఎస్యూ 10, జేడీ(యూ) 2, లోక్జన్శక్తి 1 స్థానంలో పోటీ చేస్తుండగా, ‘ఇండియా’లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ(ఎమ్ఎల్) విషయంలో కొంత గందరగోళం నెలకొంది.

జార్ఖండ్లో ఎన్నికల వాతావరణాన్ని అంచనా వేయడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 26 శాతానికిపైగా ఉన్న గిరిజనుల చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ సెగ్మంట్లుండగా వాటిలో 28 రిజర్వుడ్ స్థానాలున్నాయి. 24 జిల్లాలుండగా 21 జిల్లాల్లో లక్షకుపైగా గిరిజనులున్నారు. 43 స్థానాల్లో 20 శాతానికిపైగా గిరిజనుల జనాభా ఉంది. 22 స్థానాల్లో సగం జనాభా గిరిజనులదే. ఈ నేపథ్యంలో ‘ఇండియా’, ‘ఎన్డీఏ’ కూటములు గిరిజనులపైనే పూర్తి దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఆధిపత్యంలో ఉన్న గిరిజన నేత హేమంత్ సోరెన్కు ఆ సామాజికవర్గంలో గట్టి పట్టుంది. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో అరెస్టు చేసిందని గిరిజనల్లో ఆగ్రహం ఏర్పడడంతో బీజేపీ నష్ట నివరణ కోసం చంపాయి సోరెన్, మాజీ సీఎం శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్, గిరిజన సీనియర్ నేత అర్జున్ ముండా వంటి నేతలతో పార్టీని పటిష్టం చేయాలని చూస్తుంది. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న బీజేపీ, గిరిజన ఓట్లలో చీలికితెచ్చి పగ్గాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో 9 ఎన్డీఏ గెలిచినా, రిజర్వుడ్ 5 స్థానాలనూ ‘ఇండియా’ కూటమి దక్కించుకుంది.

గిరిజనుల్లో పట్టున్న ‘ఇండియా’ కూటమి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గంపెడాశలు పెట్టుకుంది. మహిళల కోసం తీసుకొచ్చిన ‘మాయియా సమ్మాన్’ పథకంతో వారికి ఆర్దిక సాయం అందుతుండడంతో వారు గట్టెక్కిస్తారని భావిస్తోంది. దీంతోపాటు ఆప్కీ యోజన, ఆప్కీ సర్కార్, ఆప్కీ ద్వారా, అబువా ఆవాజ్, పింఛన్ పథకాలు, ఆహార భద్రతా, క్రీడలు`విద్యా పథకాలను అమలు చేయడంతో లబ్ది చేకూరుతుందని ‘ఇండియా’ కూటమి ఆశాజనకంగా ఉంది. హేమంత్ సోరెన్ అరెస్టు కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి అనే సానుభూతి ఏర్పడిందని, అది ఎన్నికల్లో అనుకూలంగా మారనుందని కూటమి భావిస్తోంది. సహజ వనరులకు, ఖనిజ నిక్షేపాలకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందనే ప్రచారాన్ని సీఎం సతీమణి కల్పనా సోరెన్ ప్రజల మధ్యకు విజయవంతంగా తీసుకెళ్లగలిగారు. ఈ పరిణామాలకు తోడు రాష్ట్రంలో ఉన్న దాదాపు 15 శాతం ఉన్న ముస్లిం సామాజికవర్గం ఏకపక్షంగా ‘ఇండియా’ కూటమి వైపు ఉండడం వారికి సానుకూలమైన అంశం. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాల్లో స్వల్ప వ్యవధిలోనే రాణించడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చి ముఖ్యంగా రిజర్వుడ్ స్థానాల్లో ఆధిపత్యం కనబర్చడం ప్రధానంగా జేఎంఎంకు బలంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కేసులతో వేధిస్తోందని జేఎంఎం నేతలు చెబుతున్నా ముఖ్యమంత్రి మొదలుకొని పలువురు కీలక నేతలు అవినీతి కూపంలో కూరుకుపోయారనే ప్రచారం కూడా జోరుగా ఉండడం ‘ఇండియా’ కూటమికి వ్యతిరేకంగా మారుతోంది.

జార్ఖండ్లో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా రాష్ట్రంలో నిరుద్యోగం, అభివృద్ధి కుంటుపడడం వంటి ప్రభుత్వ వ్యతిరేకంశాలు ‘ఇండియా’ కూటమికి నష్టం చేకూర్చవచ్చు. జేఎంఎంకు గిరిజనుల్లో పట్టున్నా ఆ పార్టీలో హేమంత్ సోరెన్ కుటుంబ ఆధిపత్యం పెరిగిపోయిందనే విమర్శలతో ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీని వీడడం మైనస్గా మారింది. వీటితో పాటు ‘ఇండియా’ కూటమిలో సీట్ల సయోధ్య కుదిరినట్టు కనిపించినా ఆర్జేడీ, సీపీఐ(ఎంల్)ఎల్తో విభేదాలుండడం కూటమికి నష్టం కలిగిస్తున్నాయి.

2019లో ఒంటరిగా పోటీ చేసి ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ప్రధానంగా ఏజేఎస్యూతో విజయవంతంగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుంది. ఆ పార్టీ మోదీ చరిష్మాపైనే అధికంగా ఆశలు పెట్టుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్ది నెలల క్రితం జార్ఖండ్లో వేలాది కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్డీఏ ‘పంచ్ ప్రాణ్’ పేరుతో ఎన్నికల హామీలు గుప్పిస్తొంది. మహిళలకు కనీస ఆదాయం కల్పించడం, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి అందించడం, పేదలకు ఇళ్ల నిర్మాణాలు వంటి వరాలను ప్రకటిస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వసలదారులతో స్థానికులు అవకాశాలు కోల్పోతున్నారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో కీలక అస్త్రంగా మార్చుకుంటోంది. గిరిజనుల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆర్ఎస్ఎస్ చాపకింద నీరులా చేస్తున్న ప్రచారం బీజేపీకి సానుకూలంగా మారుతోంది.
గిరిజనుల్లో పట్టు కోసం ఎన్నికల ముందు పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పార్టీ బలోపేతం కావడం అటుంచి, నేతల మధ్య ఆధిపత్య పోరు నష్టం చేకూరుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానికాంశాలే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలుండడంతో మోదీ చరిష్మా పనిచేయకపోవచ్చు. కేసులతో హేమంత్ను జైలుకు పంపారనే అసంతృప్తి గిరిజనల్లో ఉండడం బీజేపీకి మైనస్ పాయింట్గా మారింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 ఎస్టీ స్థానాల్లో పార్టీ ఓడిపోవడం ఇందుకు ఉదాహరణ. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందనే ప్రచారం కూడా ప్రజల్లో బలంగా వెళ్లడం ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు.

ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పగ్గాలు కోసం అధికార ‘ఇండియా’, ప్రతిపక్ష ‘ఎన్డీఏ’ కూటముల రాజకీయాలు గిరిజనులు, ప్రజాకర్షణ పథకాల చుట్టూ తిరుగుతున్నా సీఎం హేమంత్ సోరెన్పై మనిలాండరింగ్ కేసులు కూడా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41 సంఖ్యను ఏ కూటమి దిక్కించుకుంటుందో నవంబర్ 23న వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.

Optimized by Optimole