Newsminute24

APpolitics: రైతుల గోడు పట్టని ఏపీ కూటమి సర్కార్..!

APpolitics: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది! వ్యవసాయం నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదనే స్పష్టమౌతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ లు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకూ రైతాంగం నోచుకోవడం లేదు. హామీల మేరకైనా వ్యవసాయ సమస్యల్ని తీర్చి చరిత్ర గతిని మారుస్తారా? ఇదే నిర్లక్ష్యం కొనసాగించి చరిత్రహీనులుగా మిగులుతారా? అని ఏపీ రైతాంగం ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ’ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో రైతుల ఆవేదన, అసంతఅప్తి, ఆగ్రహం స్పష్టంగా వెల్లడైంది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ‘‘మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు!’’ అని రైతులు ఒకే స్వరంతో వినిపిస్తున్నారు.
సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన హామీలు రైతులకు గుర్తున్నాయి. ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 పెట్టుబడి సాయం ఇస్తామని ‘‘అన్నదాత సుఖీభవ’’ పథకాన్ని కూటమి పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాయి. కానీ, ఏడాది గడిచినా ఈ హామీ నెరవేరలేదు. రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఏడాదిలో 143 హామీలు నెరవేర్చామని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ రైతులకు సంబంధించిన హామీలు ఎన్ని నెరవేరాయి? అనే ప్రశ్నకు సమాధానం.. సున్నా! ‘‘మీరు ఇచ్చిన మాట ప్రకారం రూ.20,000 ఎప్పుడు ఇస్తారు?’’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో రైతులు ఈ హామీని గుర్తు చేస్తూ, తమ ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కోరుతున్నారు.


కేవలం ధాన్యం సేకరణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారు. పీపుల్స్ పల్స్ సర్వేలో రైతులు చెప్పినట్లు, ధాన్యం సేకరణ తర్వాత నగదు చెల్లింపులు వెంటనే జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 8,50,342 మంది రైతులకు రూ.13,584 కోట్ల చెల్లింపులతో పాటు, గత ప్రభుత్వం బకాయి పడిన రూ.1674 కోట్లు కూడా చెల్లించింది. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఫిర్యాదూ లేదు. కానీ, రైతుల సమస్యలు కేవలం ధాన్యం సేకరణతోనే ముగిసిపోతాయా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, నీటి సౌకర్యం, ఉచిత బీమా, అన్నదాత సుఖీభవ ఎప్పుడని వారడుగుతున్నారు.
‘సూపర్ సిక్స్’ పేరిట రైతులకు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, పాడి రైతులకు రూ.2 లక్షల సబ్సిడీతో షెడ్డుల నిర్మాణం వంటివి చేస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ఇప్పుడు అవి అమలవుతున్నాయని రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ చెప్పలేదు. 60 లక్షలకు పైగా ఉన్న పాడి రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి నెరవేర్చలేదు. ‘‘మాకు షెడ్డులు ఎక్కడ? డ్రిప్ పరికరాలు ఎక్కడ?’’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగితాలకే తప్ప ఇవేవీ గ్రామాలకు చేరలేదని స్పష్టమవుతోంది.
రైతు సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వం ఏదీ? అని రైతాంగాన్ని ప్రశ్నించినప్పుడు… ‘‘డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రైతు రాజులా బతికాడు!’’ అనే సమాధానం వస్తోంది. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో ఆయన రైతులకు అండగా నిలిచారని కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా సుమారు 70 శాతం మంది రైతులు గుర్తు చేసుకున్నారు. కానీ, ఆయన కుమారుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోలేదని వాపోయారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా రైతుల కంటే కంప్యూటర్లు, కంపెనీలే ముఖ్యమని అధిక శాతం రైతులు అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యలపై గళమెత్తారు. కానీ, అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల గురించి మాట్లాడటం మానేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, కానీ రైతుల గురించి ఒక్క మాటా లేదు!’’ అని ఆకువీడులో ఓ రైతు అన్నాడు. ‘‘కౌలు రైతుల కోసం పవన్ ఏం చేశాడు?’’ అని సత్తెనపల్లిలో జనసేన సానుభూతిపరుడైన శ్రీనివాస్ అనే రైతు ప్రశ్నించాడు.


శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ, ఆయన నియోజకవర్గంలోనే 80 శాతం మంది రైతులకు ఆయన వ్యవసాయ మంత్రి అనే అవగాహనలేదని పీపుల్స్ పల్స్ అధ్యయనంలో తేలింది. ‘‘అచ్చెన్నాయుడు మంత్రి అని తెలుసు, కానీ ఏ శాఖ మంత్రో తెలీదు’’ అని రైతులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితే ఉంది. 80 శాతం మంది రైతులకు వ్యవసాయ మంత్రి ఎవరో తెలియకపోవడం రైతాంగ సమస్యలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెప్తుంది. రైతులు ఇప్పటికీ 2004-2009 మధ్య వ్యవసాయ మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, పరిస్థితిని తేలికగానే అంచనా వేయొచ్చు.
ఆంధ్రప్రదేశ్లో 70 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, రాజధాని నిర్మాణంపైనే దఅష్టి పెడుతోంది. ‘‘ఐటీ, పరిశ్రమలు ముఖ్యమే, కానీ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని రైతులు ఆశిస్తున్నారు. ‘‘యోగాంధ్రపై నెల రోజులు సమీక్షలు చేసిన చంద్రబాబు, రైతు సమస్యలపై ఎన్ని సమీక్షలు చేశారు?’’ అని రాయలసీమలో సుబ్బారెడ్డి అనే రైతు ప్రశ్నించాడు. ‘‘ఇప్పటి నాయకులకు ఫామ్ హౌజ్లు తప్ప, ఫార్మింగ్ తెలీదు!’’అని గోదావరిలో ఓ విద్యావంతుడైన రైతు వ్యాఖ్యానించిన తీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘ఇప్పుడు అంతా ప్యాంట్ చొక్కా నాయకులే గానీ, పంచె కట్టుకుని, గోచి పెట్టుకుని పొలంలోకి దిగే నాయకుడే లేరు. ప్యాంట్ చొక్కా నలగకుండా చూసుకునే ఈ నాయకులకు మట్టి అంటించుకునే మా బాధలేమి తెలుసు?’’ అని ఉత్తరాంధ్రలో త్రినాథ రావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కూడా రైతుల సమస్యలపై గట్టిగా గొంతెత్తడం లేదు. గుంటూరు, పొదిలిలో మిర్చి, పొగాకు రైతుల కోసం ఒకసారి మొక్కుబడిగా వెళ్లి మాజీ సీఎం జగన్ పరామర్శించారు, కానీ ఆ సందర్భాలు కూడా రాజకీయ హడావిడికే పరిమితమయ్యాయి. ‘‘మిర్చి ధర క్వింటాల్కు రూ.11,700 ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. నమ్మి పంట వేస్తే నష్టపోయాం!’’ అని గుంటూరులో నవీన్ అనే మిర్చి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ అప్పుడప్పుడూ రైతుల సమస్యలపై మాట్లాడినా, అవి అరణ్య రోదనలుగా మిగిలిపోతున్నాయి. ఉద్యమ తరహాలో కార్యక్రమాలు లేవు. ‘‘ కమ్యూనిస్టు అనుబంధ రైతు సంఘాలు రైతు సమస్యలపై మాట్లాడుతున్నా… వారి బలం సరిపోవడం లేదు. వారు లేవనెత్తిన అంశాలు వినే నాథుడే లేరు!’’ అని కమ్యూనిస్టు రైతు సంఘ నాయకుడు జమలయ్య చెప్పారు.
ఏడాది కాలంగా, ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. ఉచిత పంట బీమా పథకాన్ని కూడా ఎత్తివేయడంతో రైతులకు నష్టపరిహారం అందకుండా పోయింది. పెసర, శెనగ, మినుములు, కంది వంటి పంటలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాక, రైతులు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసరకు రూ.8682, మినుములకు రూ.7400, ఎర్ర శెనగలకు రూ.5440 మద్దతు ధరలు ప్రకటించినా అవి రైతులకు అందడం లేదని పీపుల్స్ పల్స్ పరిశీలనలో వెల్లడయ్యింది. వ్యాపారులు, దళారులు కనీసం రూ.1500 తక్కువకు కొంటున్నారని రైతులు ఆందోళనగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర అమలు చేయించే వ్యవస్థే లేదు. ప్రభుత్వానికి ఇది పట్టడం లేదు.


కౌలు రైతుల కోసం ఎన్నికల ముందు కూటమి అనేక హామీలు ఇచ్చింది. కొత్త కౌలు చట్టం తెస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ, రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలు రైతుల్లో లక్ష మందికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఈ గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వల్ల పంట బీమా వారికి వర్తించడం లేదు. బ్యాంకులో రుణాలు పొందడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ‘‘కౌలు రైతుల సమస్యలు పట్టించుకునే నాయకుడు ఎవరూ లేరు!’’ అని సత్తెనపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కౌలు రైతుల సమస్యలపై గళమెత్తి, అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా… సంవత్సర పాలనలో కౌలు రైతుల కోసం ఆయన చేసేందేమీ లేదని భీమవరంలో రామరాజు అనే రైతు అన్నారు.
రాయలసీమను విత్తన రాజధానిగా, హార్టికల్చర్ హబ్గా మారుస్తామని కూటమి హామీ ఇచ్చింది. కానీ, రైతుల భూములను సోలార్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. కోత మామిడి కిలో రూ.5 కే అమ్మకాలు జరుగుతున్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమలు రూ.12 హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని నూజీవీడులో కోటేశ్వరరావు అనే రైతు చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్కు రూ.1.50, ట్రాన్స్ఫార్మర్ ధర తగ్గింపు హామీలు కూడా నెరవేరలేదు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధర రూ.1,050 వరకు పలుకుతుంటే, కంపెనీలు రూ.500 కంటే తక్కువకు కొంటున్నాయని రవి అనే ఆక్వా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాదిన పంజాబ్ రైతులు ఉద్యమించేవరకు ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోదని వామపక్ష సానుభూతి పరుడైన ఈ రైతు చెప్పారు.
‘‘చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి’’ అనే ముద్ర ఆయనకు గతంలోనూ ఉంది. 1995-2004 మధ్య రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన 10 ఏళ్లు అధికారంలోకి రాలేకపోయారు. 2014లో రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చి, ఆ హామీ నెరవేర్చకపోవడంతో 2019లో ఓడిపోయారు. 2024లో మళ్లీ రైతులకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు, కానీ రైతులను మళ్లీ నిరాశపరుస్తున్నారు. ‘‘రైతు కంట కన్నీరు పెట్టకూడదు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నాయకుల మాటల్లో రైతు అనే పదమే వినపడటం లేదు!’’ అని రైతులు వాపోతున్నారు. ‘‘తిండి కలిగితే కండ కలదోయ్… కండ కలవాడే మనిషోయ్!’’ అని కవి గురజాడ అప్పారావు అన్నారు. కానీ, తిండి గింజలను ఇచ్చే రైతులను పట్టించుకోకపోతే కండ ఉండదు, కడకు అధికారమూ ఉండదు!

రైతులు కేవలం ఓటర్లు మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాదులు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, చరిత్ర మళ్లీ పునరావఅతమవుతుంది. రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చిన ఎన్టీఆర్ను, ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన వైఎస్ఆర్ను రైతులు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు రైతుల గుండెల్లో ఎందుకు చోటు సంపాదించుకోలేకపోయారు? ఇప్పటికైనా ఆయన రైతు సమస్యలపై సమీక్షలు నిర్వహించి, పరిష్కారాలు చూపాలి. రైతుల గోడు పట్టించుకోకపోతే, ప్రభుత్వం పునాదులే కదిలిపోతాయని చరిత్ర గుర్తు చేస్తుంది. చరిత్రను గమనంలోకి తీసుకొని హామీలు నెరవేర్చి రైతు మన్నన పొందుతారో, చరిత్రహీనులుగా మిగిలిపోతారో…. ఇది కూటమి నాయకులే తేల్చుకోవాలి.

 


-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ.

Exit mobile version