Apnews: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజాభిప్రాయం: పీపుల్స్ పల్స్

Peoplespulse: రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే… లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా లబ్దిదారుల్లో సంతృప్తి స్థాయిని అధిక స్థాయిలో పెంచే అవకాశం ఉంది. తద్వారా పథకానికి మరింత జనాదరణ లభించడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట కూడా పెరుగుతుంది, ఎన్నికల హామీని పకడ్బందీగా అమలు చేస్తోందన్న రాజకీయ లబ్ది ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు దక్కుతుందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ జరిపిన పైలట్ సర్వే స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు ఏడాది పొడుగునా లబ్ది చేకూరుస్తున్న ఈ పథకాన్ని, రూపాయి అదనపు భారం లేకుండా సంస్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. పథకం అమలు, లబ్దిదారుల మనోగతం, వారి సాధకబాధకాలతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణను వారెలా కోరుకుంటున్నారో ఈ సర్వేలో వెల్లడైంది.

tdp,janasena,bjp,

లబ్దిదారులేం కోరుతున్నారు…?

మహిళా సంక్షేమాన్ని, కుటుంబ ఆర్థిక భద్రతను, పర్యావరణ పరిరక్షణను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ‘దీపం-2’ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని 31, 2024 దీపావళినాడు ప్రారంభించింది. దాదాపు రూ.3 వేల కోట్లు ఈ పథకానికి ఖర్చు పెడుతున్నప్పటికీ… ఈ పథకం పట్ల ప్రజలు సంతృప్తి పొందడటం లేదని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన పైలట్ సర్వేలో స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మొదటి విడతలో దాదాపు 97 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పూర్తి చేసుకుని, రెండో విడత పంపిణీ కూడా మొదలయింది. మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దాదాపు రూ.800 కోట్ల ఖర్చు చేసినా… ఈ పథకంపై ప్రజల్లో చర్చ లేకపోగా, లబ్దిదారులు సంతృప్తిగా కూడా లేరు. ఈ పథకం ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయలేదని, అమలు జరుగుతున్న తీరు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తప్ప ఇతర మంత్రులు ఓన్ చేసుకోలేదు. కేవలం వీరు ఇద్దరు మినహా ఇతర ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు సైతం పట్టించుకోకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఈ పథకానికి తగినంత ప్రచారం లభించటంలేదు. దీంతో పాటు ఈ పథకంపై సమర్థవంతమైన ప్రకటలు ఇవ్వడం, ప్రజల్లోకి చేరేలా క్యాంపెయిన్ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశాల కారణంగా పథకం ప్రజల్లో అంత ప్రభావం చూపలేకపోతున్నట్టు స్పష్టమవుతోంది.

కూటమి మేనిఫెస్టో ‘సూపర్-6’లో ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రధాన హామీగా ఉంది. తక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని కోటి కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్దిపొందుతున్న ఇలాంటి ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తప్ప ఇతరులు అంతగా శ్రద్ద చూపట్లేదు. రాష్ట్రమంతటా, అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే విధంగా విస్తరించి అమలవుతున్న ఈ కార్యక్రమం గురించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు మాట్లడకపోవడం, సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో సానుకూలత లభించడం లేదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలతోనే వారిలో అసంతృప్తికి దారి తీసిందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అధ్యయనంలో వెల్లడయ్యింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) ప్రారంభానికి ముందు ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం చేయకపోవడం వల్ల పథకం అమలు చేయడంలో ప్రభుత్వం పదే పదే మార్గదర్శకాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రజల్లో అనవసర గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వం తమ విశ్వసనీయతను కూడా కోల్పోతోంది.

 

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-)పై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి, సవాళ్లు, మెరుగుదల వంటి వివిధ అంశాలపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అధ్యయనం చేసింది.

ఎ. పథకం పట్ల ప్రజల్లో సంతఅప్తి ఉందా?
బి. డబ్బులు ఖాతాలో జమ చేయాలా? లేక నేరుగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా?
సి.డబ్బులు ఎన్ని రోజులకు పడుతున్నాయి?
డి.మూడు సిలిండర్లు ఏడాదికి సరిపోతున్నాయా?
ఈ. ఉచిత గ్యాస్ వల్ల ఖర్చులు తగ్గాయా?
ఎఫ్. ఏవైనా సమస్యలు ఉన్నాయా? మార్పులు కోరుతున్నారా?
జి. ఈ పథకం వల్ల కూటమికి పొలిటికల్ డివిడెంట్ లభిస్తోందా?

ఇటువంటి పలు రకాల ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టడం ద్వారా…. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాస్త్రీయ సర్వే జరిపాము. 500 శాంపిల్స్తో 2025 మే 5 నుంచి 2025, మే18 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మధ్యాంద్ర, గోదావరి జిల్లాల్లో ముఖాముఖి పైలట్ సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో ప్రభుత్వ అధికారిక సమాచారం, తాజా గణాంకాలు, ప్రజల అభిప్రాయాలు సేకరించి ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఏమి అవసరమో ఆలోచించాము. నిర్దిష్ట ప్రశ్నావళితో మాత్రమే కాకుండా పలువురితో కాసేపు ముచ్చటించడం, వారి మనసు తెలుసుకోవడం వంటి చర్యల ద్వారా సమీకరించిన సమగ్ర సమాచారంతో ఈ నివేదికను రూపొందించాం.

పథకం నేపథ్యం:

కూటమి ప్రభుత్వం రాకముందు వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఒకనొక సమయంలో 11 వందల రూపాయిలు కూడా దాటింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ కొనుక్కొలేకపోతున్నామని బెంబేలెత్తిపోయారు. ఇదే సమయంలో పెరుగుతున్న నిత్యవసరాల ధరలకు నిరసనగా ప్రజల తరఫున ‘బాదుడే బాదుడు’ పేరిట తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేపట్టింది. జనసేన కూడా మరో రూపంలో ఉద్యమం చేసింది. ఈ అంశాలన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందు తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమి తన ‘సూపర్ సిక్స్’ హామీలో భాగంగా పేద మధ్య తరగతి ప్రజలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే, దీపావళినాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్(దీపం-2) అమలు… ఖర్చు:

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఉచిత గ్యాస్ సిలిండర్ ‘దీపం-2’ పథకానికి అర్హులు. రాష్ట్రంలోదాదాపు 1 కోటి 56 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో, ఈ పథకానికి అర్హులైన 1 కోటి 10 లక్షల మంది లబ్దిదారులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి నాలుగు నెలలకో సిలిండర్ చొప్పున ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తే, ఈ పథకానికి ఏడాదికి రూ.2800 కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ, రూ. 2684 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరాలంటే మరో రూ.125 కోట్లు ఈ పథకానికి అదనంగా కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర గరిష్ట ధర రూ.876 ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.25 సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన రూ.851లను, సిలిండర్ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తోంది. కానీ, ఆచరణలో ఈ ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంది. మొత్తం లబ్దిదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని, ఏడాదికి సరిపడే రూ 846 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గ్యాస్ కంపెనీలకు విడుదల చేస్తోంది. గ్యాస్ కంపెనీల వారు తిరిగి సిలిండర్ వారిగా, లబ్దిదారులు చెల్లించిన మొత్తాన్ని 48 గంటల్లో వారి వారి ఖాతాల్లో జమచేస్తున్నారు.

2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు ఇచ్చిన మొదటి రౌండ్ లో 97.59 లక్షల సిలిండర్లు బుక్ చేసుకోగా… వారి ఖాతాల్లో జమ చేసేందుకు రూ.846 కోట్ల రుపాయిల సబ్సిడీ నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ఏప్రిల్-జూలై 2025 రెండో రౌండ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందులో ఇప్పటికే 60.77 లక్షల సిలిండర్లు డెలవరీ చేయగా, 10.07 లక్షల మంది లబ్దిదారులకు రూ.81.16 కోట్ల సబ్సిడీ ఖాతాలో జమ అయినట్లు ప్రభుత్వం తన అధికార వెబ్ సైట్ లో అప్డేట్ చేసింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంతృప్తి ఉన్నారా?

లబ్దిదారు గ్యాస్ బండ బుక్ చేసి, బండకు డబ్బులు చెల్లించిన తర్వాతే ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలకు ‘ఉచితంగా గ్యాస్ సిలిండర్ లభించింది’ అనే భావన కలగడం లేదు. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థసర్వేలో పాల్గన్న 80 శాతంమంది ‘ఉచిత గ్యాస్’ పథకం గురించి అడిగితేగానీ చెప్పలేదు. పదిమందిలో ఏడుగురు ఈ పథకం ద్వారా లబ్ది పొందినప్పటికీ… వారికి ఉచిత గ్యాస్ వచ్చినట్టు ఎక్కడా చెప్పడం లేదు. ముందుగా డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసిన తర్వాత తిరిగి ఆ డబ్బులు వారి ఖాతాలో పడుతూ ఉండటంతో ఉచిత గ్యాస్ పొందామనే భావన వారిలో కలగడం లేదు.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొంటున్న ‘రచ్చబండ’, ఇతర కార్యక్రమాలను పీపుల్స్ పల్స్ బృందం పరిశీలించినప్పుడు ఒక అసక్తికరమైన విషయాన్ని గమనించింది. ‘‘ మీలో ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చినవారు చెయ్యి పైకెత్తండి?’’ అని ఆయన అడిగితే ఆ సమావేశాల్లో ఒక్కరు కూడా చెయ్యి పైకెత్తడం లేదు. ‘‘అదేంటి? నా దగ్గర ఇంతమంది ఉచిత గ్యాస్ సిలిండర్ పొందినట్లు, వారి ఎకౌంట్లో డబ్బులు పడినట్లు లిస్ట్ ఉంది’’ అని అంకెలతో సహా చెప్పగానే కొంతమంది చెయ్యి పైకెత్తుతున్నారు. దాదాపు రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉంది. ఉచిత గ్యాస్ పథకం అమలు… లబ్దిదారుల్లో సదరు సంతృప్తి కలిగించడంలేదని, ఉచితంగా పొందుతున్నామన్న తృప్తిని మిగల్చడం లేదని చెప్పడానికి ఇదే చక్కటి నిదర్శనం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చేస్తున్న ఇటువంటి ప్రక్రియను సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చేస్తే.. ఈ పథకం అమలులో ఉన్న లోపాలు ఏంటో స్పష్టంగా తెలుస్తాయి.
ఈ ఉచిత గ్యాస్ పథకం కింద ప్రస్తుతం రూ.876 పెట్టి లబ్దిదారుడు సిలిండర్ బుక్ చేసుకుంటే, అటు పైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లో డబ్బులు మళ్లీ తిరిగి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీని వల్ల లబ్దిదారుల్లో అనవసర గందరగోళం ఏర్పడుతోంది.

ఉదాహరణకు కొడుకు డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేస్తే, రికార్డు ప్రకారం తల్లి లబ్దిదారుగా ఉంటుంది కాబట్టి, ఆ డబ్బులు ఆమె ఖాతాలో జమ అవుతున్నాయి. తల్లి తన బ్యాంకు ఖాతా లావాదేవీలు చూసుకోకపోవడమో, కొడుకుకు (చెల్లించిన మరెవరికైనా) తిరిగి చెల్లించకపోవడమో జరుగుతోంది. ఫలితంగా ‘ఉచితం ఎక్కడ? సిలెండర్ కి నేనే డబ్బు కట్టాను కదా! అనే భావన సదరు కుమారునికో, ఇంకొకరికో ఉండటం వల్ల ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ప్రజాదరణ రావడం లేదు. తల్లి, కొడుకు అనే కాదు, కుటుంబంలో ఎవరో ఒకరు చెల్లించడం, ఆ డబ్బులు కుటుంబంలో వేరేవాళ్ల ఖాతాలో పడటం జరుగుతోంది. దీనివల్ల ఇటు ప్రజలకు ‘ఉచిత గ్యాస్’ పొందుతున్నామనే భావన కలగడం లేదు, అటు ప్రభుత్వానికి ప్రతిష్ట`పాలక కూటమికి రాజకీయలబ్దీ లభించడం లేదు. అమలు విధానం, పద్ధతి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నా… వేన్నిళ్లకు చన్నీళ్లలాగా, పెరుగుతున్న నిత్యవసర ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం పట్ల ప్రజల్లో 90 శాతం మంది సంతృప్తి గానే ఉన్నారు. గ్రామీణ మహిళల్లో ఈ పథకం పట్ల సంతృప్తి చాలా ఎక్కువగా ఉంది.

డబ్బులు ఖాతాలో జమ చెయ్యాలా? ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా?

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉచిత గ్యాస్ పథకం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు అమలు చేయాలా? లేక మార్పు చేయాలా? అని అడిగినప్పుడు నూటికి నూరు శాతం జీరో బిల్లుతో ఫ్రీగా గ్యాస్ సిలిండర్ డెలవరీ చేయాలని కోరారు. ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించి, ఆ తర్వాత 48 గంటల్లో ఆ డబ్బును ఖాతాలో జమ చేయడం వల్ల ప్రజల్లో ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్’’ పథకం అనుభూతి కలగలేదని ఈ సర్వేలో వెల్లడయ్యింది. ఉచితం అంటే ఉచితంగానే రావాలనేది ప్రజల సైకాలజీ! ప్రభుత్వం ఇచ్చినా సరే, వారి చేతుల్లో నుంచి డబ్బులు వెళ్లకూడదు!! పక్క రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకల్లో ఫ్రీ బస్సు కోసం జీరో టికెట్ ఇస్తున్నట్టుగానే… ఇక్కడ కూడా జీరో బిల్లుతో ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తేనే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుంది, ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మైలేజీ వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది.

‘దీపం- 2’ మొదటి విడత అమలు తర్వాత ఫ్రీ గ్యాస్ పథకం వల్ల క్షేత్ర స్థాయిలో తగినంత మైలేజీ రావడం లేదని ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయినా దీనిని ప్రభుత్వం పట్టించుకోనట్టే వ్యవహరించింది. ముందస్తు గ్రౌండ్ వర్క్ లేకుండా తొందరపాటుగా ప్రారంభించడమే ఈ లోపానికి కారణమని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. కానీ, దీనికి కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సరైన పరిష్కారం కనుక్కోక ముందే మరో తప్పటడుగు వేస్తున్నట్లు కనపడుతోంది.
శాస్త్రీయ అధ్యయనం లేకుండా, అధికార స్థాయిలో చర్చ లేకుండా మరో కొత్త విధానానికి పాలకపక్షం స్థాయిలో ఒక ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇస్తున్నట్టు గ్యాస్ కంపెనీల ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో, సిలిండర్ బుకింగ్ కన్నా ముందే నగదు వేయాలనేది ఈ ఆలోచన, ఇది మే 14న, టీడీపీ పొలిట్ బ్యూరో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని….. మీడియాలో పతాక స్థాయిలో వచ్చింది. టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న ఈ నిర్ణయం సరైందా? కాదా? అనే అంశపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినప్పుడు, ఈ ప్రకటన… ఈ పథకంపై మరింత గందరగోళానికి దారి తీస్తోందనే అభిప్రాయమే వచ్చింది. ఇది ప్రభుత్వానికి ఏ మాత్రం సానుకూలంగా లేకపోగా, ప్రభుత్వ విశ్వసనీయత కూడా తగ్గిపోయే ఆస్కారముంది.

ఇంత కీలకమైన నిర్ణయం కూడా ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండానే టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకుందని స్పష్టమవుతోంది. ఎందుకంటే, ఇంట్లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ఎవరికీ తెలియదు! ప్రభుత్వం ఒక సమయానికి డబ్బులు ఖాతాలో వేస్తే, లబ్ధిదారుడికి గ్యాస్ వేరే సమయంలో బుక్ చేసుకోవచ్చు. దీంతో గ్యాస్ బుక్ చేయడానికి ముందే డబ్బులు వేయడం వల్ల సదరు డబ్బులను ఇతర అవసరాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి, గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు వేయడం వల్ల 30 శాతం మైలేజీ వస్తే… ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే ఖాతాలో డబ్బులు జమ వేయడం వల్ల ఫలితం శూన్యం అని పీపుల్స్ పల్స్ పైలట్ సర్వేలో వెల్లడయింది.

టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ బుకింగ్ కన్న ముందే డబ్బులు వేసినా, ఉచితంగా గ్యాస్ పొందుతున్నామనే అనుభూతి ప్రజలకు కలగదు. ముందుగా ఖాతాలో పడిన డబ్బు ఇతర అవసరాలకు ఖర్చయిపోయి, వాస్తవంగా సిలెండర్ బుక్ చేయాల్సి వచ్చినపుడు సొంత డబ్బు చెల్లిస్తున్న భావనే ఉంటుంది. లబ్దిదారులు ముందే కట్టిన సిలెండర్ గ్యాస్ డబ్బు 48 గంటల్లోపే తిరిగి చెల్లిస్తుంటే కూడా… మా సర్వేలో పాల్గన్న లబ్దిదారులు చాలామంది తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడం లేదు. అలా తెలుసుకోకపోవడం, డబ్బులు ఖాతాలో ఆలస్యంగా జమ కావడం వంటి అంశాలతో ప్రజల్లో పథకం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. అత్యధిక శాతం ప్రజలు ‘‘నేరుగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తేనే బాగుంటుంది’’ అనే అభిప్రాయం బలంగా వినిపించారు.

వైసీపీ బాటలో కూటమి…

టీటీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం ప్రకారం ఒకవేళ ఉచిత గ్యాస్ డబ్బులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తే… గత వైఎస్ఆర్సిపి బాటలోనే కూటమి కూడా నడిచినట్లు అవుతుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు జగన్ బటన్ నొక్కి డబ్బులు పంచుతున్నారని విమర్శించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్లడం వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లడమే కాకుండా, ప్రతిపక్షానికి అస్త్రం ఇచ్చినట్లవుతుందని క్షేత్రస్థాయిలో ప్రజలు తమ అభిప్రాయంగా వెల్లడించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా రూ.3వేల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని ఉచిత గ్యాస్ పథకానికి ఖర్చు చేస్తూ.. కనీసం గ్రౌండ్ వర్క్ చేయకుండా, కేవలం ఐవీఆర్ఎస్ సర్వేలు నమ్ముకుని పని చేయడం, ఆ తర్వాత యూ టర్నులు తీసుకోవడం వల్ల ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, జీరో బిల్లుతో ఉచిత గ్యాస్ ఇస్తేనే ప్రజలు సంతృప్తి పొందుతారు. అలాగే, కూటమికి పొలిటికల్ డివిడెండ్ వచ్చే అవకాశంకూడా ఉంటుంది.

మార్పులు కావాలా?

సర్వేలో పాల్గొన్న మహిళల్లో 70 శాతం మంది డెలివరీ, సబ్సిడీ జమ సమయం విషయంలో వేగం పెరగాలని కోరుకున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ఉచిత గ్యాస్ అమలైన కొన్ని ప్రాంతాల్లో రీఫిల్ డెలివరీ ఆలస్యం, బ్యాంక్ లింకింగ్ సమస్యలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ టీం గుర్తించింది. మొదటి విడతలో చాలామందికి సమయానికే డబ్బులు పడ్డాయి కానీ, రెండో విడతలో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 48 గంటలకు పడలేదని, చాలా ఆలస్యం అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పీపుల్స్ పల్స్ టీం చిత్తూరులో తిరుగుతున్నప్పుడు ‘‘ అమ్మా మీకు ఫ్రీ గ్యాస్ డబ్బులు పడ్డాయా?’’ అని అడిగాం. ఆమె ‘‘పడలేదు సార్’’ అని చెప్పింది. లిస్టులో మాత్రం డబ్బులు పడినట్టే డేటా ఉంది. సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదిస్తే ‘ఆమె డబ్బులు పోస్టాఫీస్ ఖాతాలో జమ అయ్యాయి’ అని చెప్పారు. ఇదే విషయాన్ని తిరిగి సదరు మహిళకు చెప్తే…‘‘ మీ డబ్బులు పోస్టాఫీసుల్ పడ్డాయి కదమ్మా?’’ అంటే తను ‘‘నాకు పోస్టాఫీస్ ఎకౌంటే లేదు’’ అని చెప్పింది. 5 నెలల కింద తీసుకున్నారు కదా? ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో మళ్లీ అడిగితే… ‘‘ గుర్తొచ్చింది సార్, అయినా ఆ రూ.800 కోసం ఇప్పుడు అంత దూరం వెళ్లాలా?’’ అని ఎదురు ప్రశ్న వేసి, ఇచ్చేదేదో ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోద్ది కదా? సార్ అని గొణుక్కొంది. ఇది కేవలం ఒక ఉదంతమే. మా టీంకి అనేక చోట్ల ఇలాంటి అనుభవాలే ఎదరుయ్యాయి. ఇవన్నీ జీరో బిల్లుతో గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.

మూడు సిలిండర్లు సరిపోతున్నాయా?

‘మీకు మూడు సిలిండర్లు సరిపోతున్నాయా?’ అని పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అడిగినప్పుడు 60 శాతం కుటుంబాలు మూడు సిలిండర్లు సరిపోతున్నాయని చెప్పగా, 40 శాతం మంది పెద్ద కుటుంబాలకు మూడు సిలిండర్లు సరిపోవని అభిప్రాయపడ్డారు. ‘‘మూడు సిలిండర్లు మా ఇంటికి సరిపోవడం లేదు.మా ఇంట్లో ఆరుగురం ఉంటాం.’’ అని ఒక చిరు వ్యాపారి చెప్పాడు.

ఉచిత గ్యాస్ వల్ల ఆదా అవుతోందా?

ఉచిత గ్యాస్ పథకం వల్ల మీకు ఎంత ఆదా అయ్యింది? అని అడిగినప్పుడు లబ్ధిదారులు 80 శాతం మంది ఆదా అవుతోందని చెప్పారు. ఇలా ఆదా అయిన డబ్బును వేరే అవసరాలకు వాడుకుంటున్నాం అని చెప్పారు. పేద కుటుంబాల ఆర్థిక భారం ఎంతో కొంత తగ్గించడంలో ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు గ్యాస్ ఖర్చు తగ్గడం వల్ల ఇతర అవసరాలకు ఖర్చు పెట్టే అవకాశం పెరిగింది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్త కనెక్షన్లు:

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్దిదారులు 9.65 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సంవత్సర కాలంగా ఈ కనెక్షన్ల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలిసి వాటి సాధనకు నిర్వీరామ కఅషి చేస్తున్నారు. ఆయన కఅషి ఫలించి, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 56 లక్షలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం అమలైతే… రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేయడంలో కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఈ గ్యాస్ కనెక్షన్ల మంజూరీకి ముఖ్యమంత్రితో సహా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా కఅషి చేస్తే వేగవంతగా మంజూరు అయ్యే అవకాశం ఉంది.

కస్టమర్ కేర్ పని చేయడం లేదు…

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించడానికి 1967 టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నెంబర్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఈ నెంబర్ గురించి అడిగినప్పుడు అసలు అది ఉందని తమకు తెలియదనే వారు చెప్తున్నారు. వ్యవస్థ ఉందని తెలిసినవారు, కాల్ కలవడం లేదు అని అక్కడే డయల్ చేసి మరి మా బృందానికి చూపించారు. దీంతో పాటు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం నడుపుతున్న వెబ్ సైట్ కూడా సరిగ్గా పని చేయడం లేదని అత్యధికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఐవీఆర్ సర్వే వల్ల ఫలితం ఉండదు:

ఉచిత గ్యాస్ పథకం మీద ప్రభుత్వం IVRS సర్వే జరిపించి, ఆ సమాచారంతో అంతా బాగుందని అనుకుంటోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో విశ్వ విద్యాలయాలు, విశ్వసనీయ సర్వే సంస్థలు ఉన్నాయి. వారితో కలిసి అన్ని ప్రాంతాల నుంచి సరైన నిష్పత్తిలో కనీసం 20 వేల శాంపిల్స్ తో ముఖాముఖి సర్వే చేయించడం వల్ల ఈ పథకం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది.

సలహాలు- సూచనలు:

ఉచిత గ్యాస్ సిలిండ్ (దీపం-2) పథకాన్ని మెరుగుపరచడానికి, కింది సూచనలు పాటిస్తే… లబ్దిదారుల్లో సంతఅప్తి, పథకంపై ప్రజల్లో సదభిప్రాయంతో పాటు కూటమికి రాజకీయ లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది.

– ప్రజల్లో స్పష్టంగా ‘‘ఉచిత గ్యాస్’’ పొందుతున్న అనుభూతి కలిగించేందుకు, లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ‘జీరో బిల్లు’ ద్వారా నేరుగా ఉచితంగానే సిలిండర్ అందించే విధానాన్ని అమలు చేయాలి. ఇది ప్రభుత్వ హామీ అమలుని ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించేలా చేస్తుంది.

– ప్రతి నెలా ఉచిత గ్యాస్ పథకం అమలు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారులతో సమీక్షించాలి. లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, సమస్యలను త్వరగా పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ పథకం అమలులో ప్రత్యక్షంగా పాల్గనాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పథకం గురించి నాయకులు, అధికారులు తరచూ మాట్లాడాలి. వేరువేరు వేదికల్లోనూ ప్రస్తావించాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం చేస్తున్న మేలు ప్రజల మనసుల్లో నాటుకుపోతుంది.

– గ్రామీణ ప్రాంతాల్లో పథకం వివరాలు, నెరవేరే ప్రయోజనాలు వంటి విషయాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళా సంఘాలు, గ్రామ సచివాలయాల ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇంటింటికీ ఫ్రీ గ్యాస్ కు సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలి.

– మండల/గ్రామ స్థాయిలో అదనపు డిపోలు ఏర్పాటు చేసి, రీఫిల్ బుకింగ్-డెలివరీ మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. దీపం-2 అధిక కనెక్షన్లున్న చోట డెలివరీ బృందాల సంఖ్యను పెంచాలి.

– ఉచిత గ్యాస్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలను, వారు పొందుతున్న ప్రయోజనాలు తెలిసివచ్చేలాగా మీడియా, సోషల్ మీడియా, గ్రామ సభల ద్వారా బయటి ప్రపంచానికి చూపించాలి.

– ఒకవేళ పాత విధనాన్నే అమలు చేస్తే బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్, మొబైల్ అప్లికేషన్, వన్-స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

– పెద్ద కుటుంబాలకు అదనపు సిలిండర్ లేదా అదనపు సబ్సిడీ డిమాండ్ ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, మూడు సిలిండర్లు కాకుండా, కనీసం ఒక్క సిలిండర్ బయట కొనుక్కున్నా సదరు కుటుంబాల వారికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ భావన కలగడం లేదు. దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు తక్కువ వ్యవధిలోనే ఉండటం వల్ల నవంబర్ రౌండ్ లో ఇచ్చే సిలిండర్ త్వరగా అయిపోతున్నట్లు సర్వేలో తేలింది.

– పథకం వల్ల వచ్చిన మార్పులు, కుటుంబాల్లో ఏర్పడిన సానుకూల ప్రభావాలను సక్సెస్ కథనాలుగా, వీడియోలుగా, ప్రకటనలుగా, ఫీల్డ్ స్టడీలుగా ప్రజల్లో విస్తఅతంగా ప్రచారం చేయాలి.

– IVRS మెసేజ్‌ల ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న లబ్ధిదారులకు తరచూ ఈ పథకం గురించి సంక్షిప్త సందేశాలు పంపాలి.

– సెలబ్రెటీలను (సినితారలు, క్రీడాకారులు) ఈ పథకం ప్రచారం కోసం ప్రభుత్వం వినియోగించుకోవాలి.
రీల్స్‌, షార్ట్స్‌, వాట్సప్‌ ద్వారా ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

– గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఉచిత గ్యాస్ గురించి ప్రచారం చేయాలి.

Optimized by Optimole