Bhattilettertokcr: పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు లేఖరాశారు.ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలో పోడుభూముల సమస్యతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్ ‘ పాదయాత్రలో అనేక మంది గిరిజనులు పోడుభూముల సమస్యలను ఏకరువు పెట్టుకున్నారని..ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్పార్టీ తరపున గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత తనపై
ఉందని భట్టి పేర్కొన్నారు.
కాగా 2014 లో కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు పలుమార్లు చేసిన ప్రకటనలతో పోడు హక్కు పత్రాలు అందుతాయని వేలాది మంది గిరిజనులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని భట్టి లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోడుభూముల పత్రాల ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు.పోడు భూముల సమస్యను కేవలం ఎన్నికల్లో అస్త్రంగా వాడుకుని.. సమస్య పరిష్కారాన్ని విస్మరించడాన్ని గిరిజనులు ఎప్పటికీ క్షమించరని సీఎల్పీనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.