Mlckavitha: ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోందని ట్వీట్ లో ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని.. అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని పేర్కొన్నారు.
రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని..అవసరమైతే 30 లేదా 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేసి కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటి? అని కవిత ప్రశ్నించారు.
ఇక రేషన్ తీసుకోని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కార్డులు మంజూరు చేయాలని ట్విట్టర్ వేదికగా కవిత డిమాండ్ చేశారు.