Janasena:పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని అన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని… నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జన సేనాని సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది. పార్టీ ప్రజల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉంది. యాత్రకు జనం వస్తున్నారు నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలి. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.
రూల్ ఆఫ్ లాను వైసీపీ విస్మరించింది..
ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయింది.. ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పని చేయాలని.. వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు పవన్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదన్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పని.. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయిందని మండి పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మనం రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయిందన్నారు. కొంత మందికి ఒక్క రోజులోనే అర్ధం అయిపోయింది.. ఇప్పుడు 70 శాతం ప్రజలకు తెలిసిపోయిందని పవన్ స్పష్టం చేశారు.