హుజూర్నగర్ లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా- నేనా తరహాలో మాటల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెరపైకి రావడం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు రసకందకాయంగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే తనపై పోటిచేయాలనిఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి సవాల్ విసిరాడు. 50 వేల ఓట్ల మెజార్టతో గెలవడం ఖాయమని..మెజార్టీలో ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు. గెలుపుపై ఆయన అంత ధీమాగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. ఇప్పటికే ఓదఫా నియోజకవర్గ పర్యటన పూర్తిచేశారు.తనకున్న పాత పరిచాయలతో పట్టణం, గ్రామం తేడా లేకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధులను పలు అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. వీటికి తోడు..నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. రానున్న ఎన్నికల్లో ఉత్తమ్ కు బాగా ఉపకరిస్తుందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
అటు అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి 80వేల్ల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఇప్పటికే ప్రకటించాడు . ఉప ఎన్నికలో గెలిచిన నాటి నుంచి మూడేళ్లలో రూ.3,500 కోట్లతో అభివృద్ధి చేసినట్లు.. తాను చేసిన అభివృద్ధే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్న ధీమా శానంపూడిలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయనపై ఉన్న ఆరోపణలు మైనస్ గా ప్రజలు చర్చించుకుంటున్నారు. దందాలు.. సెటిల్ మెంట్లు.. కొంత వ్యతిరేక వర్గం ఉండటం.. ఆయన గెలుపుపై ప్రభావం చూపే అవకాశముందున్న చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉంటే..బీజేపీకి విషయానికొస్తే సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి.. ఇటీవల వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన గట్టు శ్రీకాంత్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటిచేసి గట్టు ఓడిపోయారు. సేవాకార్యక్రమాలు చేస్తుండటం.. వ్యక్తిగతంగా యువతలో మంచి ఇమేజ్ ఉండటం..ఆయనకు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు.
ఇక ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు ఏ పార్టీ నుంచి చేసేది క్లారీటి లేకున్నా.. సేవా కార్యక్రమాలు, ఆర్ధిక సహాయం పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపార్టీ నుంచి టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.