Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని అన్నారు. తాటిపర్తి రైతుల ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నాయకులు పోరాడటం మొదలుపెట్టారని.. రైతుల పక్షాన నిలిచిన జనసేన పార్టీ నాయకులను పోలీసులు, అధికారులు నిలువరిస్తున్న తీరు అప్రజాస్వామికమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కోదండరాముని చెరువులో ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఎంత తవ్వారు అనే లెక్కలు కూడా అధికారుల దగ్గర లేకపోయినా- మట్టి మాఫియాను వెనకేసుకొని వచ్చేలా మాట్లాడుతున్నారని రైతులు, జనసేన నాయకులు పార్టీ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
కాగా వైసీపీ పాలకులకు రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని స్పష్టం అవుతోందన్నారు మనోహర్. వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని అర్థం చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ నేతలు మాకినీడు శేషుకుమారి, తుమ్మల రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పటికే తాటిపర్తి చేరుకొని ఆందోళన చేస్తున్నవారికి బాసటగా నిలిచారని కొనియాడారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేస్తున్నారని.. తాటిపర్తి రైతుల వేదనను, మట్టి మాఫియాకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. తక్షణమే అక్కడ మట్టి తవ్వకాలు నిలిపివేయని లేని పక్షంలో ఈ ఆందోళనను ప్రజాస్వామ్యరీతిలో మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తామని మనోహర్ హెచ్చరించారు.