Telangana: విత్తనం రైతు ప్రాథమిక హక్కు: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం, అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిన్ రెడ్డి హాజరయ్యారు.గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో విత్తనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు హాజరై వారు తయారు చేసిన విత్తనాలను స్టాల్స్ లో ప్రదర్శించారు. దాదాపు 30 కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి రైతులు స్వతహాగా తయారు చేసుకున్న మూల విత్తనాలను వాటి ప్రాముఖ్యతను వివరించారు.

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా లోని రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఈ విత్తనాల పండుగలో పాల్గొన్నారు.విత్తనాల పండుగ వేడుకలో పాల్గొన్న రైతు కమిషన్ కోదండరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విత్తనం రైతు ప్రాథమిక హక్కుని, కానీ గత మూడు దశాబ్దాలుగా అది మల్టీ నేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఫలితంగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాని గుర్తుచేశారు. విత్తనం రైతు హక్కు అనేది నినాదం కాదని, అది రైతు జీవన విధానానికి మార్గదర్శకమన్నారు. ఒకప్పుడు రైతు తాను పండించిన పంటలో నుంచే విత్తనం పెంచుకొని భద్రపరిచి మళ్లీ వచ్చే పంటకు వాడుకునే వాడని, అంతటి ప్రాధాన్యత ఉన్న విత్తనం నేడు క్రమంగా రైతు చేతిలో నుంచి బయటకు పోయిందన్నారు. విత్తనం రైతు చేతుల్లో లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేకుండా పోవచ్చన్నారు. మళ్లీ రైతులు చేతులకి విత్తనం రావాలని, రైతులు ప్రకృతి సాగు వైపు దృష్టిపెట్టాలని కోరారు. విత్తనాల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దొంతి నరసింహారెడ్డి అభినందించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇక భూసారం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు పై ఉందన్నారు కమిషన్ సభ్యులు కేబీఎన్ రెడ్డి.
పెస్టిసైడ్ చల్లడం తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలన్నారు. భూసారం తగ్గడం వల్ల పంట దిగుబడి పడిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. మన పూర్వికులు చేసిన పద్ధతుల్లో మళ్లీ పంటల సాగు చేయాలనీ సూచించారు. పురుగుమందులు ఎరువుల వాడకం తగ్గిస్తే మంచిదన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన రైతులు వారు తయారుచేసుకున్న విత్తన స్టాల్స్ ను పరిశీలించారు.

Optimized by Optimole