హైదరాబాద్, జూలై 9:
కార్మికులు శతాబ్దాల పోరాటంతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలన్న కుట్రలను కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (లేబర్ కోడ్లు) తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
“కార్మికుల హక్కులను కాలరాసే విధంగా రూపొందించిన కొత్త లేబర్ కోడ్లు పూర్తిగా అన్యాయమైనవి. ఈ చట్టాలను వ్యతిరేకించడానికి ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకు రావాలి,” అంటూ కవిత ట్వీట్ చేశారు.