పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని సిద్ధూ సోదరి సుమన్ తూర్ ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను తెలుపుతూ కన్నీటీ పర్యంతమయ్యారు.
ఓ విషాదకర ప్రమాదంలో అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. సిద్ధూ కనీసం సంతాపం తెలపలేదన్నారు సుమన్ తూర్ . ఈ విషయంపై అతను రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 1986లో తండ్రి భగవత్ సింగ్ సిద్ధూ మృతి చెందిన తర్వాత తమ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయన్నారు. ఆ తర్వాత కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు సిద్ధూ.. తనను, తల్లిని ఇంట్లోంచి గెంటేశాడని ఆమె వాపోయారు. అప్పట్లో ఇంటి నుంచి సమీపంలోని బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్లింది ఇంకా గుర్తుందన్నారు. 1989లో దిల్లీ రైల్వేస్టేషన్లో తన తల్లి దిక్కులేనిదానిలా మరణించిందని వివరిస్తూ సుమన్ తూర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Posted inNews