పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది: నాదెండ్ల మనోహర్

Jansena: పోలవరం ప్రాజెక్టుని  జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టు సందర్శించి, అధికారులతో చర్చలు జరుపుతారని చెప్పారు. పూర్తి సమాచారంతో వాస్తవాలు ప్రజల ముందు పెడతామన్నారు. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామన్నారు.

కాగా  గురువారం భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర విభజన సందర్భంలో మన జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో గొప్ప ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 660 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంకితభావంతో పని చేసే మన రైతులు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకంటే ముందుంచుతారని నమ్మారని.. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలసి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందాని.. మొన్న వచ్చిన వరదల్లో ప్రాజెక్టుకు అపార నష్టం కలిగిందని.. డయా ఫ్రం వాల్లో మరమ్మతులు చేయాల్సి అవసరం ఉందని మనోహర్ పేర్కొన్నారు.

వైసీపీని ఇంటిని సాగనంపడమే లక్ష్యం..

ముఖ్యమంత్రికి నిజంగా నిజాయితీ ఉంటే ప్రతి బిడ్డ సత్య నాదెళ్ల కావాలన్న కోరిక ఉంటే బైజూస్ పేరిట రూ. 700 కోట్ల స్కామ్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి సమర్ధత లేదని మనోహర్ మండిపడ్డారు. పరిపాలనా దక్షత లేదని.. జనసేన పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అవసరం అయితే కేంద్రం బాధ్యత తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. డ్యామ్ నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.  పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పని చేస్తుందాని.. ప్రతిపక్ష ఓటు చీలకుండా నిజాయితీగా ప్రయత్నం చేస్తామన్నారు. దానికి అనుగుణంగానే పరిణామాలు ఉంటాయన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ ఎన్నికలు.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వైసీపీని ఇంటికి పంపాల”ని మనోహర్ పిలుపునిచ్చారు.

 

వెంకట సాయిబాబా ఆలయ వార్షికోత్సవాల్లో..

అంతకు ముందు  నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు.. మల్లినీడి బాబి నిర్వహణలో ఉన్న భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబ ఆలయ ద్వాదశ వార్షికోత్సవ మహోత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయనకు ఆలయ నిర్వాహక కమిటీ మంగళవాద్యాలు, వేద మంత్రాలతో  ఘనస్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని  మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మల్లినీడి బాబి సద్వినియోగం చేసుకున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి  చేగొండి హరిరామజోగయ్య  పాల్గొన్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole