Headlines

Telangana:విత్తనం మూలం ఇదం జగత్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావాలి..

Khadtal:  కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే  దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం  రైతు సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 20 అంశాలతో ఐదు భాషల్లో డిక్లేరేషన్ ప్రకటించారని..2004లో ఈ అంశాలన్నిటితో ముసాయిదా తయారు చేశామని ఇప్పుడైనా దానిని ఆమోదింప చేసుకొని అమలుపరిచినట్లయితే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన విత్తనాలను మనం రక్షించుకోగలుగుతామని ఏం. కోదండ రెడ్డి అన్నారు. అలాగే విత్తన సంరక్షణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు ధాన్యాల విత్తనాలను  భద్రపరిచి పంచుకునే విధానం తిరిగి పునర్జీవింప చేసుకోవాలని,  మిశ్రమ పంటలతో ,పంట మార్పిడి విధానాలతో రైతులు వ్యవసాయం చేయాలని, ఇలాంటి అంశాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి రైతు కమిషన్ను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

ఇక తెలంగాణ వార్షిక విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమంలో భాగంగా  తెలంగాణ ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ.. మానవ సాంఘిక జీవనానికి విత్తనం మూలాధారమని వ్యవసాయాన్ని, విత్తనాన్ని కనుగొన్న ఆదిమ మానవుడు ఎంతో గొప్ప వాడని  కొనియాడారు.  గతంలో ఎక్కడా విత్తన షాపులు ఉండేవి కావని రైతే మేలైన విత్తనాలను నిల్వ చేసి, ఇతరులకు పంచి తాను వ్యవసాయం చేసేవాడని అలాంటి విత్తన మేధోసంపత్తిని రైతు కోల్పోయాడని అంటూ నూనె గింజలు పండించే స్థితిలో ప్రస్తుతం రైతు లేడని వాపోయారు.వ్యవసాయాన్ని రైతుల నుంచి దూరం చేశారని, రైతు  బతకలేని స్థితికి చేరుకున్నప్పటికీ పంటలు పండించడమే ధ్యేయంగా జీవిస్తున్నారని ఆ స్థితి మారాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. విత్తనం మూలం ఇదం జగత్ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావాలని కోరారు. భూమి, నీరు, గాలి,ఆకాశం నిర్లక్ష్యానికి గురవుతోందని రైతులకు చెయ్యెత్తి జై కొట్టినప్పుడే పంచభూతాల పరిరక్షణ జరుగుతుందని, ఆకుపచ్చ విప్లవం రావాలని దానికి  అన్మాస్ పల్లి ఎర్త్  సెంటర్ కేంద్రం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. విత్తనం పంట అనే వాగ్దానాన్ని ఇస్తుంది కనుక దానిని మనము పరిరక్షించుకోవాలని, త్వరలో రైతులు – విత్తనం పై పాటలు రాసి దానిని ఒక సిడి రూపంలోకి తీసుకువచ్చేలా సిజిఆర్ తో కలిసి కృషి చేస్తానని సుద్దాల అశోక్ తేజ చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి రచించిన ‘ఆరోగ్యానికి ఆహారం భద్రతకు విత్తనం’ పుస్తకాన్ని నాగిరెడ్డి ఆవిష్కరించగా మొదటి కాపీని సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. సిసిఆర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన  వ్యవసాయ సంస్థల నిపుణులకు సర్టిఫికెట్ అందజేశారు.

సిజిఆర్ తీర్మాణాలు.
భవిష్యత్తు తరాల కోసం విత్తనాలు సంరక్షించడం..పౌరు సమాజం ద్వారా వికేంద్రీకృత పరిరక్షణ పునరుత్పత్తి భాగస్వామ్యం ద్వారా జీవవైవిద్యం కోసం కృషి చేయడం.  విత్తనాలు సంరక్షించి ఇచ్చిపుచ్చుకోవడం విత్తన సంరక్షణ వ్యాప్తిలో మహిళల పాత్రను విస్తృతపరచడం. వివిధ విత్తనాలు, వృక్షాలపై పేటెంట్ మేధో సంపత్తి హక్కు ఇచ్చే బాధ్యత విధానాన్ని వ్యతిరేకించడం. స్వదేశీ  విత్తనాలన్నీ ప్రజల మధ్య ఉంచడం.దానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించడం వంటి 20 అంశాలతో తీర్మానాన్ని ఆమోదింప చేశామని, అధికారికంగా త్వరలోనే  వివిధ ప్రభుత్వాలకు సంస్థలకు అందజేసి ఈ అంశాలన్నీ అమలయ్యేలాగా సిజిఆర్ కృషి చేస్తుందని వ్యవసాయ నిపుణులు దొంతి నరసింహారెడ్డి  ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ కళాశాల కరస్పాండెంట్ శాంతి వెదుల,వ్యవసాయ నిపుణుడు రామ్ నాధ్ శ్రీరామ కృష్ణ, సిజిఆర్ వ్యవస్థాపకులు నీల లక్ష్మారెడ్డి,మాజీ ఆర్టీఐ కమిషనర్ ఆర్.దిలీప్ రెడ్డి,వినోబా సెరా ప్రతిస్థాన్, భువనేశ్వర్ మనోజ్ జెనా,వందేమాతరం ఫౌండేషన్ రవీందర్,రైతులు,విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు,డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Optimized by Optimole