బెంగాల్ లో రాష్ట్రపతి పాలన..?

బంగాల్లో రాష్ట్రపతి పాలన విధింపుపై కేంద్రం తన వైఖరి తెలియజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, బంగాల్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అలాగే.. హింస వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు పరిహారంపైనా వైఖరి తెలపాలని స్పష్టం చేసింది.
బంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్కు చెందిన న్యాయవాది రంజనా అగ్నిహోత్రి, సామాజిక కార్యకర్త జితేందర్సింగ్లు.. ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా నిలిచిన వేలాది మందిని టీఎంసీ శ్రేణులు భయబ్రాంతులకు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని అధికరణ 355,356 ప్రకారం కేంద్రం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని కోరారు.
రాష్ట్రంలో అంతర్గత కలహాలను నిర్మూలించి సాధారణ పరిస్థితులను కల్పించేందుకు కేంద్ర బలగాలను మోహరించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. అలాగే.. ఎన్నికల తర్వాత హింసపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని విన్నవించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *