వనస్థలిపురం, జూన్ 26: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడి వైద్య సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులను, ప్రసూతి వార్డులను ప్రత్యేకంగా సందర్శించిన ఆమె, అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పలు విభాగాల్లో పరికరాల కొరత ఉందని, కొన్ని చోట్ల మరమ్మతులు అవసరమని వైద్యాధికారులు తెలియజేయగా, దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ – అవసరమైన అన్ని సదుపాయాలు త్వరితగతిన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నర్సింగ్ కళాశాల కోసం ప్రత్యేక భవనం కేటాయించాలన్న అభ్యర్థనపై స్పందించిన ప్రతిమాసింగ్, ఇందుకు సంబంధించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీని పరిశీలించిన ఆమె, రోగులకు అవసరమైన అన్ని మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో భాగంగా మహేశ్వరం మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ త్రివేణి, అడిషనల్ ప్రిన్సిపాల్ నాగమణి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ జయమాల, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.