BJPTELANGANA: తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులకు, సానుభూతి పరులకు మింగుడు పడటం లేదు.తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ విషయంలోనూ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కాకుండా.. ఇతర పార్టీలతో జతకట్టేందుకు అన్నట్లుగా హైకమాండ్ నిర్ణయాలు ఉండటమే అసలు సమస్యగా మారుతోందని ఆ పార్టీ సానుభూతిపరులు గుసగుసలాడుకుంటున్నారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న సమయంలో హఠాత్తుగా ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి అవకాశం కల్పించారు. దాంతో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు దక్కించుకుంది.దీనికి తోడు బీఆర్ఎస్తో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపణలు సైతం వినిపించాయి.
ఇక 8 మంది బీజేపీ ఎంపీలతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్న బీజేపీకి పవర్ ఫుల్ అధ్యక్షుడు వస్తారని అంతా ఆశించారు. అధికార కాంగ్రెస్ కు బీజేపీ ధీటుగా ఎదిగేలా అధ్యక్ష ఎన్నిక ఉంటుందని క్యాడర్ భావించింది. కానీ గ్రేటర్ నుండి రామచంద్ర రావు ఎంపిక కేసీఆర్ నెత్తి మీద పాలు పోసినట్లేనని పార్టీ అభిమానులు నెత్తినోరు బాదుకుంటున్నారు. మరోవైపు బీజేపీ హైకమాండ్ నిర్ణయం ఆ పార్టీ శ్రేణుల కన్నా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎక్కువ సంతోషం నింపేలా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అటు ఈటల రాజేందర్ అభిమానులు బీజేపీ హైకమాండ్ నిర్ణయం పై గుస్సా అవుతున్నారు.అధ్యక్ష పదవి ఎంపికలో పార్టీలోని కొంతమంది నాయకులు ఈటల కు వ్యతిరేకంగా జట్టు కట్టారని..ఆయనకు పదవి రాకుండా అడ్డుపడ్డారని వాపోతున్నారు. ఏది ఏమైనా తమ నాయకుడి నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.ఇటు బీసీ సంఘాల నాయకులు సైతం బీజేపీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.