Apnews: ముదురుతున్న పాలకుల ‘బంగారు’ పిచ్చి…!!

Apnews:

లక్ష్యాలు నెరవేరి, ఆశయాలు సిద్దించాలి. ప్రజాపథకాల అమలులో అందుకు చిత్తశుద్ది ముఖ్యం గానీ,
పేరు మార్పుతో జరిగేదేముంది? ప్రజలకు ఒరిగేదేముంది? ఈ మధ్య పాలకులకిదో పిచ్చి పట్టుకుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్దమైంది. అమలు అధోగతి పాలై, వ్యవస్థ కుప్పకూలుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చట్టం ద్వారా పథకం పేరు మార్చే క్రమంలో ఆర్డినెన్స్‌ తేవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్దమైంది. కొత్తపేరు ‘స్వర్ణ గ్రామం’ ‘స్వర్ణ వార్డు’ అట! ఈ ‘స్వర్ణం’ పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కాదు, పాతికేళ్ల కింద ‘స్వర్ణాంధ్ర’ రాగాలు పాడారు. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత పైపైకి వెళుతుంటే, జనానికి చేరువగా పాలనను తెచ్చే పథకాలకు ఈ ‘బంగారం’ పేర్లేంటో అర్థమే కాదు!

ప్రభుత్వ పాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికేంద్రీకృత ‘సచివాలయ’ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఏర్పడ్డవే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు. పౌరులకు పెన్షన్‌ వంటి వ్యక్తిగత లబ్ది చేకూర్చే వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు రెవెన్యూ, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయం, పశుపోషణ, మహిళా భద్రత వంటి వివిధ విభాగాల సేవల్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల్ని ఏర్పరచి, అందులో పది మందిపైన ఉద్యోగుల్ని నియమించి ఈ వికేంద్రీకరణ చేపట్టారు. ముందు కన్సాలిడేటెడ్‌ వేతనాలపై పనిచేసిన ఈ సిబ్బంది ఇప్పుడు పూర్తిస్థాయి స్కేల్‌-జీతభత్యాలు పొందుతున్నారు. దీనికి తోడు సగటున ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున ‘స్వచ్ఛంద సేవకుల’ను నియమించి, వాలెంటర్‌ వ్యవస్థను గత ప్రభుత్వం నడిపింది. వాలెంటర్లకు నెలనెలా అయిదువేల రూపాయల గౌరవభృతి ఇచ్చేది. సచివాలయానికి, గ్రామస్తులు/వార్డు పౌరులకు మధ్య సంధానకర్తగా ఉండే ఈ వాలెంటర్లు పెన్షన్‌ డబ్బుల్ని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అప్పగించడం నుంచి పలు సేవలు అందించేది. కుల, జన్మ, మరణ దృవపత్రాలను ఇప్పించడం, వేర్వేరు సేవలకు సంబంధించిన ధరఖాస్తుల్ని సచివాలయం ద్వారా సంబంధిత శాఖా కార్యాలయాలకు చేర్చడం, సర్కారు స్పందనల్ని, పరిష్కారాల్ని పౌరులకు అందించడం వరకు వారికి సహాయకారులుగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక వాలెంటర్‌ వ్యవస్థ రద్దయింది. పాక్షికంగా ఇప్పుడా పనుల్ని సచివాలయ ఉద్యోగులే చేస్తున్నారు. మొదట మొత్తంగా 15000 పై చిలుకు సచివాలయాలు ఏర్పడగా 1.34 లక్షల ఉద్యోగులు, 2.52 లక్షల వాలెంటీర్లు ఇందుకోసం నియమితులయ్యారు. 35 విభాగాలకు చెందిన 500 సేవలు సకాలంలో, సజావుగా ప్రజలకు అందాలని, ఏ అంశమైనా గరిష్టంగా 72 గంటల్లో పరిష్కారమ‌వ్వాలని ఉద్దేశించారు. వాలెంటీర్లు మొత్తం వెళ్లిపోగా ఇపుడు దాదాపు లక్ష మంది ఉద్యోగులు మిగిలారు. అసలీ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దిశలో సాగుతోంది. సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ, సమన్వయం లేక అధోగతి పాలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లక్ష్యం నీరుగారుతుంటే ‘బంగారు’ కాంతులెక్కడ?
ఏపీ మంత్రివర్గంలోని ఒక మంత్రే, ప్రయివేటు సంభాషణలో అన్నట్టు ‘….. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒక బంగారు చెవిపోగు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ స్వర్ణ గ్రామమేంటో, స్వర్ణ వార్డేంటో?!?’ అనే భావన అక్షర సత్యం. ఏపీ సీఎం చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రి అయిన కాలంలో ‘స్వర్ణాంద్ర’ కలలు కనేది! అదే క్రమంలో ‘విజన్‌2020’ విధాన పత్రాన్ని ప్రకటిస్తే నాటి విపక్షనేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి దాన్నోక ‘దశాబ్ది ఉత్తమ కాల్పనిక పత్రం’గా విమర్శించారు. ఆ పత్రంతో, తదనంతర కార్యాచరణతో నిమిత్తం లేకపోయినా…. తర్వాతి పరిణామాల్లో జరిగిన మంచినంతా తన ఖాతాలో వేసుకోవడానికి, చెడుని తనకు సంబంధం లేని వ్యవహారంగా చూపేందుకు బాబు యత్నించడం మనమంతా చూసిందే! కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజన్‌- 2047 అంటూ రెండు దశాబ్దాల కలల్ని ఇప్పట్నుంచే ఆమ్మజూపుతున్నాయి. తక్షణ ఆచరణలో నిబద్దత, చిత్తశుద్ది లేకుండా సుదూర భవిష్యత్తుకు గేలాలు వేయడం, ‘బంగారు తాపడం’ పూయడం ఒక మాయ కాక మరేమవుతుంది? అన్నది హేతుబద్దంగా ఆలోచించే వారి విమర్శ. తెలంగాణ ఏర్పడ్డ నుంచి పదేళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘బంగారు తెలంగాణ’ నినాదం కూడా విమర్శలనెదుర్కొంది. ఆయన అనుచరులు, అనుయాయుల్లోనూ పక్కా భజనపరుల్ని ‘బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్‌’ అంటూ ఎకసక్కేలాడటం సొంత పార్టీలోనే జరిగింది. పెళ్లి చేసుకునే ప్రతిపేద మహిళకు ‘కళ్యాణమస్తు’ లక్ష రూపాయల నగదు కానుకతో పాటు తులం (10 గ్రా.ల) బంగారం ఇస్తామని, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఆచరణలో గాలికిపోయింది. పాలకులు పలికే ‘బంగారం’ బ్రాంతిగా మిగలడమే తప్ప వాస్తవరూపం దాల్చడం మిథ్య! పాలనా వికేంద్రీకరణ సదుద్దేశ్యంతో తెచ్చిన ‘గ్రామ`వార్డు సచివాలయ’ వ్యవస్థను సంస్కరించకుండా, బాగుపరిచే కనీస చిత్తశుద్ది చూపకుండా కేవలం పేరు మార్పుతో ఎంత ‘స్వర్ణ’పు తాపడం అద్దినా అది నిష్ప్రయోజనమే!
చేసేందుకు ఎంతో ఉంది!


ఏపీలో పదిహేను వేల వరకున్న గ్రామావార్డు సచివాలయాల్లో కనీసం రోజూ ఆఫీస్‌ ఊడ్చే వారు లేరు. అందుకవసరమైన వ్యవస్థే లేదు. ఏమంటే ‘ఇందుకోసం నిధులు లేవు, జీరో బడ్జెట్‌’ అని నోడల్‌ అధికారిగా ఉన్న ఒక డిప్యూటీ ఎంపీడీవోనే చెబుతున్నారు. ఉద్యోగులు సొంతంగానో, సొంత డబ్బులతోనో ఈ పనులు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద లక్ష్యాలతో వస్తే మొదట వాలెంటీర్లతో చేయించిన పనులు ఇప్పుడు తమతో చేయిస్తున్నారనే ఆవేదన, తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆక్రోశం మెజారిటీ సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అందుకేనేమో, కుదురుగా ఎవరూ సచివాలయాల్లో కూర్చోవడం లేదు. ‘సచివాలయ వ్యవస్థ’ తాజా స్థితిపై రాష్ట్ర వ్యాప్త అధ్యయనం చేపట్టిన ‘పీపుల్స్‌పల్స్‌’ రీసర్చ్‌ సంస్థ పరిశీలనకు వస్తున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు ఒకింత ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి, వ్యయం చేస్తూ నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఇలాగే నడిపిస్తే సమీప కాలంలోనే కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థ సమర్థ నిర్వహణకు సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ తక్షణావసరమని సర్వేలో వెల్లడవుతున్న అభిప్రాయాలు- వాస్తవ పరిస్థితుల్ని బట్టి ప్రాథమిక సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయనం జరుగుతున్న సమయంలోనే ‘పేరు మార్పు’ మంత్రివర్గ నిర్ణయం వెలువడింది. అవసరానికి మించి గ్రామావార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనేది ఒక విమర్శ. అందుకే, ఉద్యోగుల సంఖ్యని హేతుబద్దం చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఇదివరకున్నట్టు అన్ని సచివాలయాల్లో 11 మంది కాకుండా, గ్రామావార్డు జనాభాను బట్టి ఒక్కో సచివాలయంలో 6, 7, 8 మంది సిబ్బందితో సరిపెట్టడం, ఆ మేర సర్దుబాటు చేయడం అనే ప్రక్రియ మొదలైంది. అది సవ్యంగా జరగటం లేదు. దాన్ని సరిగా జరిపించి, ఆశించిన లక్ష్యం మేరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా అందేట్టు చూడాలి. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసే దిశలో ఇదొక మార్గం కావాలి.

ప్రభుత్వం నిరంతర ప్రక్రియ
పాలనలోకి రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ, ప్రభుత్వమన్నది నిరంతరంగా ఉండే ఒక బాధ్యత, అంతకు మించి జవాబుదారితనం! నిన్నటి ప్రభుత్వ విధానాలను, పేర్లను నేడు గౌరవించక, గుడ్డిగా మార్చేసే వారికి రెండు, మూడు దశాబ్దాల ‘విజన్‌’ పేరిట కార్యక్రమాలు మొదలెట్టే నైతిక హక్కు ఏముంటుంది? ‘మీరు ఎన్నికైంది అయిదేళ్లకోసమే కదా, మీలాగానే మీ తర్వాత వచ్చిన వారు మీ విధానాలను కొనసాగించక, పక్కన పడేస్తే ఏమిటి పరిస్థితి? అని అడిగితే ఏం సమాధానమిస్తారు! పైగా లోపాలను సరిదిద్ది, ప్రజోపయోగంగా విధానాలను సరిదిద్దకుండా పేరు మారిస్తే ఏమొస్తుంది? ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్నట్టుంటే గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థే కాదు ఏదీ సవ్యంగా ఉండదు. పౌర సేవల్ని సజావుగా అందిస్తూ, పాలనను ప్రజలకు చేరువచేసే చిత్తశుద్దిని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. ఇదే ప్రజాస్వామ్య ధర్మం!

dilip reddy
-దిలీప్‌ రెడ్డి,
పొలిటికల్‌, సోషల్‌ ఎనలిస్ట్‌, డైరెక్టర్‌ పీపుల్స్‌ పల్స్‌ రిసర్చ్‌ సంస్థ.

Optimized by Optimole