ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బెంగుళూరు దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా మంగళవారం దిల్లీ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(75 నాటౌట్; 42 బంతుల్లో 3×4, 4×6) చక్కటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్(31; 22 బంతుల్లో 2×6), మాక్స్వెల్(25; 20 బంతుల్లో 1×4,2×6)ఫర్వాలేదనిపించారు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్, రబాడ, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోహ్లీసేన ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దిల్లీ బ్యాటింగ్లో కెప్టెన్ రిషభ్ పంత్(58 నాటౌట్; 48 బంతుల్లో 6×4), హెట్మేయర్(53 నాటౌట్; 25 బంతుల్లో 2×4, 4×6) ధాటిగా ఆడిన ఫలితంలేకుండా పోయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా జేమీసన్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.