Biharelection: బీహార్ లో ఎన్డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్..!!

Biharelection2025:
జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.   కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీ(యూ) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)  పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టంగడుతున్న బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏకే జైకొట్టనున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్గిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో మరోసారి అధికారం రావడానికి ఎన్డీఏకి నిమో (నితీష్+మోదీ) ఫార్ములా దోహదపడింది. నితీష్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ విజయానికి కీలకంగా మారింది.
బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ పై భారీ ఆధిక్యంతో అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీయే దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమి మీద పైచేయి సాధిస్తోంది. ఎన్డీయేకి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయేకు 133-159 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహాఘట్ బంధన్ 75-101 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2  – 8 స్థానాలు,  జన్ సురాజ్ పార్టీకి 0-5  స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి.
పార్టీల వారీగా సాధించే స్థానాలను పరిశీలిస్తే ఎన్డీయే కూటమిలో బీజేపీ 63-70, జేడీయూ 55-62, ఎల్జేపీ (ఆర్వీ) 12-17, హెచ్ఏఎమ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాఘట్ బంధన్ లో ఆర్జేడీ 62-69, కాంగ్రెస్ 9-18, సీపీఐ(ఎంఎల్) 4-9  గెలిచే అవకాశాలున్నాయి. కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0-2, సీపీఐఎంకి 0-3, వీఐపీకి 0-5, సీపీఐ 0-2, ఇతరులు 2-8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఒక్కొక్క పార్టీ పొందే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బీజేపీకి 21.4 శాతం, ఆర్జేడీకి 23.3 శాతం, జేడీయూకి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జేపీకి 5 శాతం, ఇతరులకు 7.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 19.46 శాతం ఓట్లతో 74 స్థానాలు, జేడీ(యూ) 15.39 శాతం ఓట్లతో 43 స్థానాలు, ఆర్జేడీ 23.11 శాతం ఓట్లతో 75 స్థానాలు, కాంగ్రెస్ 9.48 శాతం ఓట్లతో 19 స్థానాల్లో గెలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాఘట్ బంధన్ కూటమిపై కేవలం 0.03 ఓట్ల వ్యత్యాసంతో సుమారు 11 వేల ఓట్ల ఆధిక్యంతోనే అధికారం చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ భారీ ఆధిక్యత పొందడానికి ప్రధాన కారణం జేడీ(యూ) మంచి ఫలితాలు సాధించడమే.
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ఓటర్లను ప్రశ్నించినప్పుడు ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. 2005 నుండి కొన్ని నెలలు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న  నితీశ్ కుమార్ 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 8 శాతం, ఎల్జీపీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ 8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరికి 6 శాతం, కాంగ్రెస్ నేత రాజేశ్ కుమార్ కి 2 శాతం మంది మద్దతిచ్చారు. 
  సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాలు ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం, బుద్ధిస్టులు, ఓబీసీ సామాజిక వర్గాల్లో అధిక శాతం మహాఘట్ బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీహార్ లో ఎన్డీఏకు పట్టం కట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో 66.8 శాతం మహిళలు ఎన్డీయే వైపు ఉండగా, మహాఘట్ బంధన్ కు 24.8 శాతం ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్ పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్డీయేకు బాసటగా నిలుస్తున్నాయి. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఓబీసీల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది. 
జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నీతిష్ కుమార్ పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఏన్డీఏ గెలుపుకు అనుకూలంగా మారాయి. బీహారీలను ఆకర్షించడంలో నితీష్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బీజేపీ ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మోదీ ప్రచారంలో నితీష్ను పొగడ్తలతో ముంచెత్తారు. 75 ఏళ్ల వయసులోనూ నితీష్ ఎన్డీఏకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. ఆయనకున్న క్లీన్ చీట్  ఇమేజీ ఎన్డీఏకు బలంగా మారింది. రెండు దశాబ్దాలుగా సీఎంగా ఉన్నా నితీష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ప్రజల్లో కనిపించినా ‘నిమో’ ఫార్ములా ఎన్డీఏకు అనుకూలించింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నితీష్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం మహిళల ఆశీర్వాదమే. మహిళా ఓటర్లను ఆకర్షించడం నితీష్ కు ఇది మొదటి సారి కాదు. 2007లో పాఠశాలలకు వెళ్లే బాలికలందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ, 2016లో మద్యపాన నిషేధంతో మహిళా ఓటర్లను ఆకర్షించిన నితీష్ కుమార్ ఇప్పుడు రూ.10 వేల పంపిణీతో విజయవంతమయ్యారు.
ఎన్డీఏతో పోలిస్తే మహాఘట్ బంధన్ బలహీనంగా ఉంది. ఆ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది.  నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి ఉన్నా అది పూర్తిగా తేజస్వీ యాదవ్కు అనుకూలంగా మారలేదు.  జన్ సురాజ్ పార్టీ, బీజేపీ కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్ బంధన్ కూటమి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఇప్పటికే 33 శాతం మద్దతున్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వీ యాదవ్ కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వీ యాదవ్ కు తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలు ప్రసాద్ పాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వీ యాదవ్ కు ప్రతికూలమయ్యింది. మహాఘట్ బంధన్ లో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ఎత్తుకున్న ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్ లో ఓట్లను రాల్చలేకపోయింది. 
  రెండు కూటములు సంక్షేమ పథకాలపై పోటాపోటీగా హామీలిచ్చాయి. మహాఘట్ బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, ఎన్డీఏ ‘జంగల్ రాజ్’తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాని మోదీ లాలు ప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ‘జంగల్ రాజ్’ ను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ చెబుతున్నట్టు అభివృద్ధి జరిగితే బీహారీలు ఎందుకు వలసెళ్తున్నారని మహాఘట్ బంధన్ ప్రచారం చేసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి వనరులు అధికంగా ఉండడం ఎన్డీఏకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బీజేపీ చేసిన ఖర్చు కంటే తక్కువే. 2020  ఎన్నికలకు ప్రస్తుత 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్జీపీ 2020లో విడిగా పోటీ చేయగా ప్రస్తుతం ఎన్డీఏలో ఉండడంతో ఎన్డీఏ మరింత బలపడింది.  
యావత్ దేశాన్ని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్లో బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పార్టీగా జన్ సురాజ్ ఎదగడం ఖాయమని పీపుల్స్ పల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. ఎన్డీఏలో  బీజేపీ, జేడీ (యూ) భారీగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తుండగా, ఆర్జేడీ చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తున్నా, కాంగ్రెస్ కు ఆశించిన మేరకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహాఘట్ బంధన్ కు నష్టం జరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లు ఆదరిస్తుండడంతో బీహార్ లో మరోసారి ఎన్డీఏ జయకేతనం ఖాయంగా కనిపిస్తోంది.
-జి.మురళీ కృష్ణ,
సీనియర్  రీసెర్చర్, పీపుల్స్  పల్స్ రీసెర్చ్ సంస్థ.
Optimized by Optimole