యూపీపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ సర్కార్. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్ప్రెస్వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ నిలుస్తుందన్నారు.
అటు యోగీ ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి ఉపయోగి అవుతుందంటూ చమత్కరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ఉత్తర ప్రదేశ్ త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందన్నారు ప్రధాని మోదీ.
ప్రస్తుతం ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేగా గంగా ఎక్స్ప్రెస్వే నిర్మితమవుతుంది. దీనిని 8 లేన్లకు విస్తరిస్తారు. దీనిలో 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. అత్యవసర సమయంలో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి బయల్దేరడానికి అవకాశం ఉంది. ఈ ఎక్స్ప్రెస్వే వద్ద ఓ పారిశ్రామిక నడవను కూడా ఏర్పాటు చేయనుంది బీజేపీ సర్కారు.