BJPTelangana: చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని గౌరవ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా నిలిచిందన్నారు.బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్పై కిషన్ రెడ్డి వీక్షించారు.
విక్రమ్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన సందర్భంలో కిషన్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి సందేశాన్ని వీక్షించారు.అనంతరం.. పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణపతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ ‑ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు. టపాసులు కార్చారు.
అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ సందర్భంగా ఇస్రో, చంద్రయాన్ టీమ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇస్రో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి నేతృత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగిరేస్తోంది’ అని అన్నారు.
‘చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గారికి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.కేవలం నరేంద్రమోదీ వంటి నాయకుడికి మాత్రమే ఇలాంటి చాలెంజెస్ ను స్వీకరించడం, వాటిని విజయవంతంగా పూర్తిచేసేందుకు కావాల్సిన సంకల్పబలాన్ని శాస్త్రవేత్తలకు అందించగలిగే సామర్థ్యం ఉంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.