మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి ఫైనల్ లో ప్రవేశించింది. టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇక హర్మన్ ప్రీత్ సెమీ ఫైనల్ పోరులో 30 బంతుల్లో 36 పరుగుల మెరుగైన ప్రదర్శన చేసింది. తన ఇన్నింగ్స్ లో నాలుగు బౌండరీలు ఉండడం విశేషం. అయితే హర్మన్ అంతకుముందు గాయం కారణంగా లీగ్ చివరి రెండు మ్యాచ్ లకు దూరమైంది. స్వల్ప గాయం నుంచి కోలుకున్న భారత కెప్టెన్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది.
కాగా మ్యాచ్ అనంతరం హర్మన్ మాట్లాడుతూ..తన ఆట తీరుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని..జట్టు అవసరానికి అనుగుణంగా ఆట తీరును మలుచుకోవడానికి తాను ఎల్లపుడూ సిద్ధమేనని తేల్చిచెప్పింది. థాయ్ లాండ్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని.. పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఇక ఆల్ రౌండర్ దీప్తి శర్మను భారత కెప్టెన్ ఆకాశానికి ఎత్తేసింది. జట్టు ఆపదలో ఉన్నప్పుడు దీప్తి తనవంతు పాత్ర పోషిస్తుందని.. అలాంటి ప్లేయర్ జట్టులో ఉండడం గర్వకారణమని కొనియాడింది. ఫైనల్ పోరు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని.. సమిష్టిగా ఆడి కప్ గెలుస్తామని హర్మన్ ధీమా వ్యక్తం చేసింది.