loksabhaelections2024:
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ బలమెంత? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న విషయంపై పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఫస్ట్ ట్రాక్ పోల్ ను సైతం విడుదల చేశాయి. సర్వే సంస్థల రిపొర్టు ప్రకారం తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. ఇంతకు ఆ పార్టీ గెలిచే స్థానాలు ఎన్ని అంటే ?
ప్రస్తుతం దేశంలో మోదీ గాలి వీస్తోంది. పట్నం నుంచి పల్లె దాకా .. ఎక్కడ .. ఎవరి నోట విన్నా మోదీ మంత్రం వినిపిస్తోంది. “అగ్నికి గాలి తోడైనట్లుగా అయోధ్య రామ మందిరం నిర్మాణం” మోదీ గాలికి తోడైంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మిక విజయం సాధించబోతున్నట్లుగా సర్వే సంస్థల రిపొర్టు చెబుతోంది. తెలంగాణలో ఇదే రకమైన వాతావరణం ఉందని.. బీజేపీ గతంలో కంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. దాదాపు 10 నుంచి 12 స్థానాలు బీజేపీ గెలిచేందుకు అస్కారం ఉందని .. ఈ అవకాశాన్ని తెలంగాణ నాయకత్వం ఎలా క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాలని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
మరోవైపు ” అబ్ కీ బార్ 400 పార్ ” నినాదంతో బీజేపీ దేశమంత ప్రచారం చేస్తోంది. ప్రధాని మోదీ తో పాటు బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో ఈనినాదాన్ని ప్రస్తావిస్తూ ” వికసిత్ భారత్ కోసం బీజేపీ ” కి ఓటు వేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా.. నాయకత్వం లోపంతో చేజేతులా నాశనం చేసుకొని 8 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. మోదీ గాలి వీస్తున్న వేళ పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలు జిల్లాల బీజేపీ ముఖ్య నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
మొత్తంగా అందని ద్రాక్షలా మారిన దక్షిణాదిన బీజేపీ పట్టు నిలుపుకోవాలంటే తెలంగాణ నాయకత్వం ఏసీ గదుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి ప్రజల మధ్యకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది సగటు బీజేపీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. అలాగే పార్టీ ముఖ్య నాయకులు పంతాన్ని వీడి సమన్వయంతో పనిచేస్తేనే ” అబ్ కీ బార్ 400 పార్ ” నినాదం సాకారమయ్యే వీలుందనేది పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా జరుగుతున్న చర్చ.