Tenali: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: నాదెండ్ల మనోహర్

Nadendlamanohar: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం తెనాలి నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మనోహర్ పాల్గొన్నారు.

అంతకు ముందు పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లే అవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో  మనోహర్  మాట్లాడుతూ “కాగితాల్లో చూపించిన దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదు. వందల కోట్లు ఖర్చు అయినట్లు చూపిస్తున్నారు తప్ప కనీసం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

 చెరువుల్లా మారిన లే అవుట్లు..

చిన్నపాటి వర్షానికి లే అవుట్లు చెరువులను తలపిస్తున్నాయని.. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, కరెంటు.. ఇలా ప్రతీది సమస్యేనని మనోహర్ అన్నారు. పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉందని.. మరికొంత మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతున్నాయని.. ముఖ్యంగా గంజాయి బ్యాచ్, మందు బాబులు రెచ్చిపోతున్నారని అన్నారు. సొంతింటి కోసం కలలు కన్న ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని .. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం నింపుతామని నాదెండ్ల ధీమా వ్యక్తంచేశారు.

 78 ఎకరాలు… రూ.399 కోట్లా..?

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెదరావురులో 78 ఎకరాల స్థలం కొన్నారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరా రూ.90 లక్షల నుంచి కోటి రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మాత్రం రూ.399 కోట్లకు విక్రయించారు. ఇక్కడ ఒక్క చోటే దాదాపు రూ.300 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ లే అవుట్లో 3792 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటి విడతలో 1900 ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. నాలుగేళ్లు అవుతోన్న ఇప్పటికి నిర్మించింది 489 ఇళ్లే. అది కూడా అరకొర వసతులతో. అలాగే సిరిపురం లేఅవుట్ లో 9735 లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. మొదటి విడతలో 3338 ఇళ్లు నిర్మించాలి. కానీ ఇప్పటికి నిర్మించింది 250 ఇళ్లే. నివాసం ఉంటున్నది మూడు కుటుంబాలే. దవులూరు లే అవుట్లో 356 ఇళ్లు మంజూరు అయితే పూర్తి చేసింది 86 మాత్రమే. ప్రతి లే అవుట్లో సవాలక్ష సమస్యలు. బటన్లు నొక్కా… బటన్లు నొక్కా అని పదే పదే చెప్పిన జగన్ గారూ ఎవరికి లబ్ధి చేకూర్చారో మాత్రం చెప్పలేదని మనోహర్ అన్నారు.

కదిలి వచ్చిన యంత్రాంగం..

గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలివచ్చింది. గృహ నిర్మాణం శాఖ, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, ట్రాన్స్ కో, పబ్లిక్ హెల్త్ డిపార్టమెంట్ అధికారులు హాజరై లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందు కోసం లేఅవుట్ల దగ్గర ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో లబ్ధిదారుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని  నాదెండ్ల మనోహర్  ఆదేశించారు.

You May Have Missed

Optimized by Optimole