దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు సైతం థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి. అందులో భాగంగానే కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
కొవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కరోనాకి తోడు జికా వైరస్ విజృంభిస్తుండడంతో.. ప్రభుత్వం రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో .. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. గతంలో విధించిన లాక్డౌన్ మార్గదర్శకాలే వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా తిరువనంతపురం, కొట్టాయం వంటి ప్రాంతాల్లో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ కట్టిన ఆంక్షలు కొనసాగుతాయని సర్కార్ పేర్కొంది.
ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్ నమూనాలను పరీక్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడో రోజు సగటు పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపింది.