దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అద్బుత ఫలితాలను సాధించడానికి కారణాలు ఎంటి? సీఎం యోగి ఆదిత్య నాథ్ పాత్ర ఎంత? అభివృధి మంత్రాన్ని జపిస్తూ ఎన్నికల్లో వెళ్ళినా కాషాయం పార్టీ గెలుపునకు ఏయే అంశాలు ప్రభావితం చేశాయి?
దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో బీజేపీ పూర్తి మెజార్టీ స్థానాలు సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేసి అద్భుత విజయం సాధించింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై అసంతృప్తి ఉన్నా.. యోగి అభివృద్ది మంత్రం ముందు తేలిపోయింది.
యూపీలో భాజపా విజయానికి ప్రధాన కారణాలు..
సీఎం యోగి ఆదిత్యనాథ్పై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆపార్టీకి ప్రధానంగా కలిసొచ్చింది. నేరాలను అదుపు చేసేందుకు ఆయన అనుసరించిన వైఖరికి.. మహిళల నుంచి మద్దతు లభించింది. ఈ సారి పలు ఎన్నికల సర్వేల్లో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు బీజేపీ పక్షాన నిలిచినట్లు తేలింది. కొవిడ్ సమయంలో ఉచిత రేషన్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటివి ఆ పార్టీకి ఉపయోగపడ్డాయి. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు స్కూటర్లు.. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి హామీలు సైతం బీజేపీ గెలుపునకు దోహదం చేశాయి.
ఇక యూపీలో లా అండ్ ఆర్డర్ అంశం చాలా కీలకమైంది. 2007లో ఇదే అంశంపై వాగ్దానాలు చేసిన బీఎస్పీ.. అధికారంలోకి వచ్చాకా ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయింది. నేరాల అదుపు చేయలేకపోయిందన్న అపవాదును మూటగట్టుకుంది . ఆ తర్వాతి ఎన్నికల్లో ఒక రకంగా ఆ పార్టీ ఓటమికి ఇది కారణమైంది. కానీ యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక..నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు.ఐదేళ్ల క్రైమ్. రేట్ గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
అటు కేంద్ర ప్రభుత్వ పథకాలను యూపీలో బలంగా అమలు చేశారు యోగి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. పీఎం ఉజ్వల.. ఆయుష్ భారత్.. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకాల అమలుకు కృషి చేశారు. రామ మందిర నిర్మాణం.. కాశీ విశ్వనాథ్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గోధుమ, వరికి కనీస మద్దతు ధర వంటి అంశాలు పార్టీకి కలిసొచ్చింది.
మొత్తానికి దేశరాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో లభించిన విజయంతో 2024 ఎన్నికలకు బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు.