సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు.
ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం శుభపరిణామం అన్నారు రఘురామ. జీవో 1 ను న్యాయస్థానం రద్దు చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్..చంద్రబాబును విమర్శించిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. వేరువేరుగా పోటీ చేసినప్పుడు పరస్పరం విమర్శించుకోవడం సహజమేనని .. ఈ విషయంలో వైసీపీ చేసింది ఏమిటని? ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, విడుదల రజిని లు గతంలో ఆయన్ని ఎంతగా విమర్శించారో మరిచిపోయారని ధ్వజమెత్తారు. మంత్రులతో పాటు, వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావు, వల్లభనేని వంశీ లు జగన్ ను తీవ్రంగా విమర్శించిన వారేనని గుర్తు చేశారు. మనం చేస్తే రాజకీయం… ఎదుటి వారు చేస్తే వ్యభిచారమా? అంటూ రఘురామ నిలదీశారు.
అభిమన్యుడు కాదు అర్జునుడు..
ఆవేశంతో అభిమన్యుడిలాగా కురు క్షేత్ర యుద్ధంలోకి వెళ్లి గతంలో వీరమరణం పొందితే పొంది ఉండవచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుడి లాగా తన వ్యూహాన్ని మార్చుకున్నారని రఘురామ పేర్కొన్నారు. యుద్ధంలో బలం సరిపోనప్పుడు.. గౌరవాన్ని కాపాడుకుంటూ మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పవన్ చేసిన సూచన అద్భుతంగా ఉందన్నారు. ప్యాకేజీ స్టార్… దత్త పుత్రుడు అని సంబోధిస్తే పగిలిపోతుందని పవన్ మరోసారి హెచ్చరించడం సబబేనని రఘురామ స్పష్టం చేశారు.